తిరుమలలో ఏప్రిల్ 2న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు... ఎందుకంటే ...

తిరుమలలో ఏప్రిల్ 2న వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు... ఎందుకంటే ...

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ని ఏప్రిల్‌ 2వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమం సందర్భంగా వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.  భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీ.

ఏప్రిల్‌ 2న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆల‌యాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఏప్రిల్ 9న తెలుగు ఉగాది సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా, ఏప్రిల్ 2న వీఐపీ బ్రేక్‌ను టీటీడీ రద్దు చేసింది.