
- పేసర్ రేణుకా సింగ్కు చోటు.. షెఫాలీ వర్మకు మొండిచేయి
- సెప్టెంబర్ 30 నుంచి స్వదేశంలో వరల్డ్ కప్
ముంబై: హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి తొలిసారి విమెన్స్ వన్డే వరల్డ్ కప్లో పోటీ పడనుంది. సొంతగడ్డపై జరిగే ఈ మెగా టోర్నీలో పాల్గొనే ఇండియా జట్టుకు అరుంధతితో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన యంగ్ స్పిన్నర్ శ్రీ చరణి కూడా ఎంపికైంది. సెప్టెంబర్ 30 నుంచి జరిగే ఈ ఈవెంట్ కోసం విమెన్స్ సెలెక్షన్ కమిటీ మంగళవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, టాపార్డర్ బ్యాటర్ ప్రతీకా రావల్ను జట్టులోకి తీసుకున్న సెలెక్టర్లు హిట్టర్ షెఫాలీ వర్మను పక్కనబెట్టారు. ఈ టీమ్కు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. వరల్డ్ కప్కు ముందు ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 14 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్కు కూడా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ రెండు జట్లలో కేవలం ఒక్క మార్పు మాత్రమే ఉంది. షెఫాలీకి రెండు జట్లలోనూ చోటు దక్కలేదు. వరల్డ్ కప్కు ఎంపికైన ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ గాయం నుంచి కోలుకోవడానికి సమయం ఇచ్చిన సెలెక్టర్లు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు తీసుకోలేదు. ఆమె స్థానంలో ఆస్ట్రేలియాతో వన్డేలకు ఏకైక మార్పుగా సయాలీ సత్ఘారేని ఎంపిక చేశారు. అమన్జోత్ ప్రస్తుతం బీసీసీఐ సీఓఈలో కోలుకుంటోంది.
వరల్డ్ కప్కు ఆమె పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా, ఆస్ట్రేలియా సిరీస్కు విశ్రాంతినిచ్చామని కెప్టెన్ హర్మన్ప్రీత్ తెలిపింది. ఇక, గాయం కారణంగా రేణుకా సింగ్ మార్చి నుంచి ఆడటం లేదు. తిరిగి ఫిట్నెస్ సాధించిన ఈ పేసర్ బౌలింగ్ ఎటాక్కు నాయకత్వం వహించనుంది. రేణుకతో పాటు, యంగ్స్టర్స్ క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి పేస్ బౌలింగ్ బాధ్యత చేపట్టనున్నారు. వీరికి అమన్జోత్ నుంచి సపోర్ట్ లభించనుంది. ఇక ఇంగ్లండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో 10 వికెట్లు తీసి తనదైన ముద్ర వేసిన యంగ్ స్పిన్నర్ శ్రీ చరణిని సెలెక్టర్లు వరల్డ్ కప్కు తీసుకున్నారు. చరణి ఈ ఏడాది ఏప్రిల్లోనే అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి 8 వన్డేలు, 5 టీ20లు ఆడింది. ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్లు తీసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడుతున్న నేపథ్యంలో ఊహించినట్టుగానే స్పిన్నర్లకు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. చరణితో పీటు సీనియర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్ స్పిన్ బౌలింగ్ను నడిపించనున్నారు.
వరల్డ్ కప్, ఆస్ట్రేలియాతో వన్డేలకు ఇండియా టీమ్:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తికా భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, అమన్జోత్ కౌర్ (వరల్డ్ కప్కు మాత్రమే), సయాలీ సత్ఘారే (ఆస్ట్రేలియాతో వన్డేలకు మాత్రమే).
రీఎంట్రీలో అరుంధతి అదుర్స్
ఎంఎస్ ధోనీ ఫ్యాన్గా కీపర్ కాబోయి పేసర్ అయిన అరుంధతి రెడ్డి యంగ్ ఏజ్లోనే ఆటపై తన మార్కు చూపెట్టింది. ఇప్పటికే రెండుసార్లు టీ20 వరల్డ్ కప్స్ ఆడిన 28 ఏండ్ల ఈ హైదరాబాదీ వన్డేల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే 50 ఓవర్ల వరల్డ్ కప్ ఆడే చాన్స్ దక్కించుకుంది. వేగంగా ఇండియా క్రికెట్లో తన మార్కు చూపెట్టిన ఈ అమ్మాయి అంతే వేగంగా జట్టుకు దూరమైంది. కానీ, పడిలేచిన కెరటంగా తిరిగి పుంజుకొని సత్తా చాటింది.
15 ఏండ్ల ఏజ్లోనే హైదరాబాద్ అండర్-19 జట్టులో అరంగేట్రం చేసి చూస్తుండగానే నేషనల్ టీమ్లోకి వచ్చిన ఆమె 2018, 2020 టీ20 వరల్డ్ కప్స్లో పోటీ పడింది. 2018 నంచి 2021 వరకు టీ20ల్లో రెగ్యులర్ పేసర్గా ఉంది. కానీ, పూజా వస్త్రాకర్ రాక, సీనియర్ శిఖా పాండేతో పోటీలో తుది జట్టులో చోటు కోల్పోయిన తను ఆ తర్వాత మూడేండ్ల పాటు నేషనల్ టీమ్కు కూడా దూరమైంది.ఈ క్రమంలో అరుంధతి తన రైల్వేస్ ఉద్యోగాన్ని వదులుకుని, ఇండియా విమెన్స్ టీమ్ మాజీ ఫీల్డింగ్ కోచ్ బిజు జార్జ్ సూచన మేరకు 2023–-24లో కేరళ జట్టులో చేరింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రెండు సీజన్లలో సత్తా చాటింది. ఆ పెర్ఫామెన్స్తో 2024 జులైలో నేషనల్ టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చిన తను వెనుదిరిగి చూసుకోవడం లేదు. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేసింది. వాకా గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై కెరీర్ బెస్ట్ (4/26) పెర్ఫామెన్స్ చేసి ఆకట్టుకుంది. ఏప్రిల్లో శ్రీలంక, గత నెల ఇంగ్లండ్ టూర్లోనూ మెప్పించి ఇప్పుడు జట్టులో సీనియర్ పేసర్గా మారింది.