చెక్​డ్యాంలు ఎమ్మెల్యే కమీషన్ల కోసమా?

చెక్​డ్యాంలు ఎమ్మెల్యే కమీషన్ల కోసమా?

నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో కడుతున్న చెక్ డ్యాంలు రైతుల కోసమా? లేక ఎమ్మెల్యే కమీషన్ల కోసమా అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మీటింగ్​లో ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామని నమ్మించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తన అనుచరుల పేర్లతో వందల ఎకరాలకు పట్టా చేసుకున్నారని ఆరోపించారు. పోడు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటే సరైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇప్పటికే వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. పోలీసులు డబ్బులు ఇచ్చి పోస్టింగులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​లోని కోవర్టులను సహించేది లేదని, ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్లిపోండని సూచించారు. నవంబర్ నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా గోపాల్, పాలకవీడు, నేరేడుచర్ల మండలాల  పార్టీ లీడర్లు సుబ్బారావు, చిన వెంకటరెడ్డి, సర్పంచ్ మోతిలాల్ నాయక్, నర్సిరెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.