హైదరాబాద్, వెలుగు : ‘ఆపరేషన్ కగార్-2’ పేరుతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని సాయుధ బలగాలు చుట్టుముట్టి, మావోయిస్టులను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారిని తక్షణమే వెనక్కి తీసుకొని, కూంబింగ్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ విధించిన 40 రోజుల డెడ్లైన్ పేరుతో కర్రెగుట్టల అటవీప్రాంతంలో రెండు రోజులుగా సాయుధ బలగాలు కాల్పులు జరుపుతున్నాయన్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఐదుగురు మావోయిస్టులు మరణించారని ప్రచారం జరుగుతున్నదని, మరికొంత మంది అగ్రనేతల ప్రాణాలకు హాని కలిగించేలా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరమని చెప్పారన్నారు. మావోయిస్టులు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించారని గుర్తుచేశారు. సమస్య పరిష్కారానికి మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేలా చర్చలు జరపాల జాన్ వెస్లీ పేర్కొన్నారు.
