ఆర్మూర్ లో పాతికేళ్లుగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. 1300 ప్లాట్లు.. పేదల పాట్లు

ఆర్మూర్ లో పాతికేళ్లుగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. 1300 ప్లాట్లు.. పేదల పాట్లు
  • ఆర్మూర్ ​టౌన్​ను ఆనుకొని ఉన్న కాలనీ
  • పాతికేళ్లుగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు 
  • ఇల్లు కట్టింది సగం మందే..
  • 46 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
  • డబ్బుల్లేక నిర్మాణానికి వెనుకంజ

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్​ను ఆనుకొని ఉన్న 1300 ప్లాట్ల కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. 1999 లో నిరుపేదలను గుర్తించి, 100 గజాల చొప్పున అప్పటి పాలకులు ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకుందామని వెళ్తే ముళ్లపొదలతో ఇబ్బందులు పడి, ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా.. సమస్యలు తీరలేదు. పాతికేళ్లలో ఇప్పటివరకు కేవలం సగం మందే ఇల్లు నిర్మించుకున్నారు. 

మౌలిక సదుపాయాలు లేవు..

 కాలనీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. మరో అవకాశం లేక ఇల్లు కట్టుకొని నివసిస్తున్నవారు నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు. తాగునీటి బోర్లు లేకపోవడంతో కొందరు అప్పు చేసి, వేసుకున్నారు. మిగతా వారు రెండ్రోజులకోసారి వచ్చే మిషన్​భగీరథ నీటిని పట్టుకొని, దాచుకుంటున్నారు. ఇక్కడ ఒక్క సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం జరగలేదు. ముళ్ల పొదలు, పాముల పుట్టల మధ్యే నివసిస్తున్నారు. 

కరెంట్ ​స్తంభాలు దూరంగా ఉండడంతో వందల మీటర్ల వైర్​కొనుగోలు చేసి, కనెక్షన్​తీసుకున్నారు. త్రీ ఫేజ్, వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్​లైన్లను పలువురి ప్లాట్ల మధ్య నుంచే వేశారు.  స్తంభాలను ఆనుకొనే కొందరు ఇల్లు కట్టుకోగా మరికొందరు భయపడి నిర్మించుకోలేదు.

ముగ్గు పోసుకున్న 8 మంది..

ప్లాట్​ఉండి, ఇల్లు నిర్మించుకోనివారు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోగా 46 మందికి ఇండ్లు మంజూరయ్యాయి. అయితే ఇక్కడున్న సమస్యలకు జడిసి, ఇండ్లు కట్టుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటివరకు 8 మందే ముగ్గు పోసుకున్నారు. 

త్రీ ఫేజ్ ​లైన్​ మా ప్లాట్​ మీదినుంచే ఉంది 

మా కుటుంబమంతా కూలీ పని చేస్తాం. ప్లాట్ ​ఉన్నా ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేక మొన్నటివరకు గుడిసె వేసుకొని ఉన్నం. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ మా ప్లాట్​మీదినుంచే త్రీ ఫేజ్​లైన్​ఉంది. ఇల్లు కాన్సిల్​అయితదేమోనని ధైర్యం చేసి, ముగ్గు పోసిన. అధికారులు జర మా సమస్యను పట్టించుకొని, కరెంట్​లైన్​తీసెయ్యాలె.– వెంకటేశం, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు, ఆర్మూర్

20 ఏండ్ల క్రితం మా నాన్న ఇల్లు కట్టిండు

కాలనీలో మా నాన్న 20 ఏండ్ల క్రితం ఇల్లు కట్టిండు. అప్పటినుంచి సమస్యల మధ్యే ఇక్కడ ఉంటున్నం. బురద రోడ్లు, డ్రైనేజీ నీరు ఎటుపోతుందో తెల్వది. వానాకాలం వస్తే కాలనీలో అలుగుపారినట్లే ఉంటది. చెట్లు పెరిగిపోయి, పాములు తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. ఇప్పటికైనా రోడ్లు, మోరీలు నిర్మించాలి. - రామకృష్ణ,  ఆర్మూర్