- పీఎల్ఏ కంట్రోల్లో బీజింగ్ సోషల్ మీడియాలో ప్రచారం
న్యూఢిల్లీ: చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రెసిడెంట్ జిన్పింగ్ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అధికారులు హౌస్ అరెస్ట్ చేశారని పోస్టులు కనిపిస్తున్నాయి. మన దేశంలో కూడా ఈ రూమర్ బాగా ప్రచారంలో ఉంది. బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి కూడా చైనా ప్రెసిడెంట్ హౌస్ అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతోందని ట్వీట్ చేశారు.
దేశ రాజధాని బీజింగ్ను పీఎల్ఏ తన కంట్రోల్లోకి తీసుకుందని అక్కడి ప్రజలు కూడా ట్వీట్లు చేస్తున్నారు. పలు వీడియోలలో పీఎల్ఏ వాహనాలు రోడ్లపై దూసుకెళ్తుండడం కనిపించింది. అవన్నీ రాజధాని బీజింగ్ వైపు వెళ్తున్నాయని నెటిజన్లు చెప్తున్నారు. కరోనా కాలంలో దాదాపు రెండేళ్లపాటు దేశం వదలని జిన్పింగ్ ఇటీవలే సమర్ఖండ్ వెళ్లారు. అక్కడ జరిగిన షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్(ఎస్ సీవో) సమావేశాలలో పాల్గొన్నారు.
ఆ సమయంలోనే చైనాలో కమ్యూనిస్టు పార్టీ టాప్ లీడర్లు సమావేశమై పార్టీ చీఫ్, ఆర్మీ ఇన్చార్జి పదవుల నుంచి జిన్పింగ్ను తొలగించారని అంటున్నారు. అయితే, ఈ విషయాన్ని చైనా ఆర్మీ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, న్యూస్ ఏజెన్సీలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం బీజింగ్ నుంచి వెళ్లే ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు మరో యూజర్ చెప్పారు. మరోవైపు, చైనా అమలుచేస్తున్న జీరో కొవిడ్ పాలసీ ప్రకారం.. విదేశాల నుంచి వచ్చిన వాళ్లు తప్పనిసరిగా క్వారెంటైన్లో ఉండాలి. ఈ రూల్మేరకు సమర్ఖండ్ నుంచి తిరిగొచ్చినంక జిన్ పింగ్ కూడా క్వారెంటైన్లో ఉన్నారని మరికొందరు చెప్తున్నారు.