బొల్లారంలో జూన్ 3 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

బొల్లారంలో జూన్ 3 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జూన్ 3 నుంచి సికింద్రాబాద్‌ బొల్లారంలోని 1ఈఎంఈ (1EME) సెంటర్‌లో జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కుమారులు, వితంతువులు/మాజీ సైనికులు/సేవకుల కుమారులు/సర్వీస్‌మెన్/ఎక్స్-సర్వీస్‌మెన్‌ల సొంత సోదరుల కోసం నిర్వహించనున్నారు. అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీ(ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్ వెహికల్/ మెకానిక్ డీజిల్, మెకానిక్ రిఫ్రిజర్, ఎయిర్ కండిషనర్), అగ్నివీర్ (ట్రేడ్స్‌మెన్) కేటగిరీ (స్టీవార్డ్), స్విమ్మింగ్, డ్రైవింగ్, వాలీబాల్ రంగాలలో అత్యుత్తమ క్రీడాకారులకు ఓపెన్ కేటగిరీలో ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.

పైన పేర్కొన్న కేటగిరీలకు వయస్సు పరిమితి 17½ సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్ 1, 2002 నుంచి ఏప్రిల్ 1, 2006 మధ్య పుట్టిన వారై ఉండాలి. ఇతర వివరాల కోసం అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ర్యాలీ గురించి మరింత సమాచారం కోసం హెడ్‌క్వార్టర్స్ 1 EME సెంటర్, బోలారం, సికింద్రాబాద్ ( తెలంగాణ ) పిన్-500010, ఇ-మెయిల్ awwaleagle@gmail.com , www.joinindanarmy@nic.in లేదా సివిల్ టెలిఫోన్ నంబర్ 040 27863016 ను సంప్రదించవచ్చు.

అర్హులైన అభ్యర్థులందరూ ర్యాలీలో పాల్గొనేందుకు జూన్ 3వ తేదీ ఉదయం 6 గంటలకు కోటేశ్వర్ ద్వార్, 4 ట్రైనింగ్ బెటాలియన్, 1 ఈఎంఈ సెంటర్, సికింద్రాబాద్‌లో హాజరుకావాలని పత్రికా ప్రకటనలో తెలిపారు.