ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు  తిరస్కరించిన  సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో కేజ్రీవాల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ  2024 ఏప్రిల్ 10వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆప్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు చెందిన మనీలాండరింగ్  కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21వ తేదీన  అరెస్ట్ చేసింది. అనంతరం  కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఏప్రిల్‌ 15 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.

 లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని.. ఆయన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌‌‌‌ను ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టులో హాజరుపరచగా..ఆయనను ఏప్రిల్ 15 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దాంతో కేజ్రీవాల్  ప్రస్తుతం తీహార్  జైలులో ఉన్నారు. 

అక్కడి నుంచి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌‌‌‌ చేశారు. అరెస్ట్ చేసి, రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని తన పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ  బెంచ్ మంగళవారం తీర్పును ప్రకటించారు. 25 నిమిషాల పాటు తీర్పును చదివిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ.. కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయని వివరించారు.