వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా వామనావతారంలో రాముడు

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా వామనావతారంలో రాముడు

భద్రాచలం, వెలుగు :  వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాద్రి రామయ్య వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేసి, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. బేడా మండపానికి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వామనరూపంలో అలంకరించారు.

విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత వేదవిన్నపాలు జరిగాయి. నాళాయర దివ్య ప్రబంధం పారాయణం అయ్యాక స్వామిని ఊరేగింపుగా మిథిలాస్టేడియంకు తీసుకొచ్చారు. భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవను నిర్వహించారు. కాగా ధనుర్మాసోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆండాళ్లమ్మ వారికి తిరుమంజనం జరిగింది. గర్భగుడిలో స్వామి వారికి తిరుప్పావై తొలి పాశురం విన్నవించారు.