రాహుల్.. దమ్ముంటే హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చెయ్
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సవాల్
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్, బీజేపీతో పాటు ఒవైసీని చాలెంజ్ చేసేందుకే వచ్చానని పేర్కొనడంపై ఆయన శనివారం రియాక్ట్ అయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి కూడా రాహుల్ ఓడిపోతారని, అందుకే హైదరాబాద్ నుంచి పోటీ చేసి లక్ పరీక్షించుకోవాలని అసద్ అన్నారు. హైదరాబాద్ కాకుంటే తన నానమ్మ ఇందిర పోటీ చేసిన మెదక్ నుంచైనా రాహుల్ బరిలో దిగాలని ఒవైసీ అన్నారు.
అసద్ కు కోపం ఎందుకు : మాణిక్కం ఠాగూర్
టీఆర్ఎస్, బీజేపీలను విమర్శిస్తుంటే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్కు కోపం ఎందుకు వస్తోందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, ఎంపీ మాణిక్కం ఠాగూర్ ప్రశ్నించారు. వయనాడ్ లో రాహుల్ ఓడిపోతాడని, హైదరాబాద్ నుంచి పోటీ చేసి లక్ పరీక్షించుకోవాలన్న అసద్ వ్యాఖ్యలను మాణిక్కం ఒక ట్వీట్లో ఖండించారు. ‘వరంగల్ వేదికగా చేసింది కేవలం డిక్లరేషన్ కాదు. అది గ్యారెంటీగా చేసేది. తెలంగాణ కాంగ్రెస్కు, రైతులకు మధ్య ఉన్న పార్ట్నర్ షిఫ్ లాంటిది’ అని రాహుల్ అన్న మాటలను మాణిక్కం గుర్తుచేశారు. రాబోయే 45 రోజుల్లో 300 మంది కాంగ్రెస్ నేతలు, ఒక్కొక్కరు 45 పంచాయతీల్లో పర్యటించి డిక్లరేషన్ పై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.