నోటిఫికేషన్స్ ఇచ్చుడు సరే.. భర్తీ చేస్తరా.. లేదా?

నోటిఫికేషన్స్ ఇచ్చుడు సరే.. భర్తీ చేస్తరా.. లేదా?

హైదరాబాద్: మైనార్టీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింల సమస్యల గురించి అసెంబ్లీలో ఒవైసీ మాట్లాడుతూ.. హజ్ హౌస్ పక్కన బిల్డింగులోకి అన్ని మైనారిటీ ఆఫీసులను తరలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ దాన్ని నెరవేర్చలేదన్నారు. ఆ బిల్డింగు నిర్మాణాన్ని పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇస్లామిక్ సెంటర్ కోసం 10 ఎకరాలు కేటాయించారని.. కానీ ఇప్పటికీ కన్ స్ట్రక్షన్ మొదలవ్వలేదన్నారు. ఈ హామీలన్నీ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చారని.. కానీ ఇప్పటికీ అమల్లోకి రాలేదన్నారు. వీటి గురించి చర్చించేందుకు దసరా తర్వాత మీటింగ్ కు పిలుస్తామని కేసీఆర్ అన్నారని కానీ మాట తప్పారని దుయ్యబట్టారు. దసరా, దీపావళి, క్రిస్ మస్, సంక్రాంతి పండుగలు అయిపోయాయని.. హోళీ పండుగ అయిపోయినా వాటి ప్రస్తావన ఉండదన్నారు. హామీలు నిలబెట్టుకోలేనప్పుడు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. 

‘అసెంబ్లీలోని వెల్ లోకి దూసుకొచ్చారనే కారణంతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బయటకు పంపుతున్నారు. మరి ఈ సభలో ఇచ్చిన హామీల సంగతేంటి? వాటికి విలువ లేదా? ఆ హామీలకు ప్రాముఖ్యత లేదా? అలాంటప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? ఇవాళ వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మరి, వీటినైనా భర్తీ చేస్తారో లేదో? పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక్క ముస్లిం కూడా లేడు. ఒక్క ముస్లిం పబ్లిక్ ప్లీడర్ లేడు. మైనారిటీ కమిషన్ లోనూ వారికి చోటు లేదు. రాష్ట్రంలోని ఇన్ని యూనివర్సిటీల్లో ఒక్క ముస్లిం వైస్ ఛాన్స్ లర్ అయినా ఉన్నారా? ఈ పోస్టులకు సరిపోయే ముస్లింలు లేరా? వీసీ అయ్యే సత్తా ఉన్న ముస్లిం ఒక్కరూ లేరా? ఇది చాలా బాధాకరం. వక్ఫ్ భూముల కోసం తెలంగాణ ఉద్యమం సమయంలో కోర్టుకు వెళ్లిన టీఆర్ఎస్.. రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చాక ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయని అంటోంది. ఇదెక్కడి న్యాయం’ అని ఒవైసీ క్వశ్చన్ చేశారు. బడ్జెట్ లో మైనారిటీలకు కేటాయించిన నిధులపై లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.  మైనారిటీలకు కేటాయించిన బడ్జెట్ కు... ఖర్చు చేసిన లెక్కలకు పొంతన లేదన్నారు. ఆలేరు ఎన్ కౌంటర్ రిపోర్ట్ ఏమైందని ప్రశ్నించారు. ఆ ఎన్ కౌంటర్ లో ఉన్న అధికారులకు ప్రమోషన్ కూడా వచ్చింది విమర్శించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనివర్సిటీలో ఒక్క ముస్లిం అధికారి కూడా లేరని ఫైర్ అయ్యారు. సభలో ఎవరైనా మాట్లాడితే వాళ్లను సస్పెండ్ చేస్తారన్నారు. మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఒక్క ముస్లింకైనా లోన్ ఇచ్చారా అని ప్రశ్నించారు.   

మరిన్ని వార్తల కోసం:

ఒకప్పుడు మన భాషను జోకర్లా పెట్టేటోళ్లు

ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం గుడ్న్యూస్