న్యూఢిల్లీ: ప్రస్తుతం బీఎస్ఈ సీఈఓ, ఎండీగా పనిచేస్తున్న ఆశిష్ కుమార్ చౌహాన్, త్వరలో ఎన్ఎస్ఈ సీఈఓగా బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ఎస్ఈ సీఈఓగా ఆశిష్ను నియమించడానికి సెబీ అనుమతిచ్చింది. ఎన్ఎస్ఈ ఫౌండర్లలో ఒకరైన ఆశిష్, ఈ ఎక్స్చేంజి ప్రస్తుత సీఈఓ విక్రమ్ లిమాయే స్థానంలో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. విక్రమ్ 5 ఏళ్ల పదవీ కాలం శనివారంతో ముగిసింది. అర్హతులన్నీ ఉన్నప్పటికీ రెండో టెర్మ్ పనిచేసేందుకు విక్రమ్ ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం వివిధ స్కామ్లతో ఎన్ఎస్ఈ విమర్శలు ఎదుర్కొంటోంది. కోలొకేషన్ కేసులో ఎన్ఎస్ఈ మాజీ ఎండీ చిత్ర రామక్రిష్ణను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
నిఫ్టీని క్రియేట్ చేసిన ఆశిష్..
నిఫ్టీతో పాటు దేశంలో మొదటి స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ను కూడా ఆశిష్ చౌహాన్ క్రియేట్ చేశారు. 1993–2000 మధ్య ఆశిష్ చేసిన కృషికి గాను, ఆయన్ని దేశంలో మోడర్న్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్కు ఫాదర్గా పిలుస్తారు. 2009 నుంచి బీఎస్ఈలో ఆశిష్ పనిచేస్తున్నారు. ఈ ఎక్స్చేంజ్ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎక్స్చేంజిగా ఆయన మార్చారు. బీఎస్ఈ రెస్పాన్స్ టైమ్ 6 మైక్రో సెకెండ్లుగా రికార్డయింది ఆయన టెనూర్లోనే. ఈ ఎక్స్చేంజి రెవెన్యూని పెంచడంతో, మొబైల్ స్టాక్ ట్రేడింగ్ను ఇండియాకు ఆశిష్ పరిచయం చేశారు. కరెన్సీ, కమోడిటీస్, ఈక్విటీ డెరివేటివ్స్, ఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఎంఎఫ్ వంటి వివిధ సెగ్మెంట్లనూ దేశంలో ప్రవేశపెట్టారు.