
- గత 11 ఏళ్లలో 6 రెట్ల పెరుగుదల: మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: ఇండియాలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గత 11 ఏళ్లలో 6 రెట్లు పెరిగి రూ.11.5 లక్షల కోట్ల పరిశ్రమగా మారిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలానే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు 8 రెట్లు పెరిగాయని, ఈ రంగం 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. ఇప్పుడు మొబైల్ ఫోన్కు అవసరమైన గ్లాస్, కవర్, చిప్, పీసీబీ (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్) , కెమెరా మాడ్యూల్ వంటివి దేశంలోనే తయారవుతున్నాయని వివరించారు.
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ స్కీమ్లతో ఇది సాధ్యమైందని అన్నారు. హర్యానాలోని సోహ్నాలో ఇటీవల ప్రారంభించిన ఫ్యాక్టరీలో ఏడాదికి 20 కోట్ల బ్యాటరీ ప్యాక్స్ తయారవుతాయని, దేశానికి 50 కోట్ల బ్యాటరీలు అవసరమని తెలిపారు. ప్రజలు స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభించిందన్నారు.