చైనా మాంజా మనుషుల ప్రాణాల మీదకు తెస్తోంది. చైనా మాంజా అమ్మొద్దు ..కొనొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా వినడం లేదు. హైదరాబాద్ లో చాలా చోట్ల మనుషుల తలలు,కాళ్లు చేతులు తెగుతున్నాయి. లేటెస్ట్ గా నల్లకుండ పీఎస్ లో విధులు నిర్వహిస్తోన్న ఏఎస్ఐ నాగరాజు చైనా మాంజాతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఏఎస్ఐ నాగరాజ్ విధుల్లో భాగంగా ఎగ్జిబిషన్ డ్యూటీకి జనవరి 12న సాయంత్రం ఉప్పల్ లోని తన ఇంటి నుంచి బయలుదేరాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ స్వరూప్ నగర్ దగ్గరకు రాగానే మెడకు చైనా మాంజా తగిలి గొంతుకోసుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది..
జనవరి 12న రాత్రి అల్మాస్ గూడలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి కాలికి చైనా మాంజా తగిలింది. ఈ ఘటనలో.. వృద్ధురాలి కాలు తెగిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. చైనా మాంజా ప్రజలు, వాహనదారుల పాలిట యమపాశంలా మారుతోంది. ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు చైనా మాంజా(సింథటిక్ దారం)ను వాడుతున్నారు. అయితే, రాష్ట్రంలో చైనా మాంజాపై నిషేధం ఉన్నా దొంగచాటున అమ్ముతున్నారు.
.
