
- ఆరంభం.. అదుర్స్
- మొదలైన ఆసియా గేమ్స్..కలర్ఫుల్గా ఓపెనింగ్ సెర్మనీ
ఆసియా గేమ్స్ చైనాలోని హాంగ్జౌలో శనివారం ఘనంగా మొదలయ్యాయి. ఓపెనింగ్ సెర్మనీ అందరినీ ఆకట్టుకుంది. అథ్లెట్ల పరేడ్లో ఇండియా ఎనిమిదో స్థానంలో నడిచింది. ఫ్లాగ్బేరర్లు హర్మన్ప్రీత్ సింగ్, లవ్లీనా బొర్గొహైన్ త్రివర్ణ పతాకంతో ఇండియా టీమ్ను ముందుండి నడిపించారు. అక్టోబర్ 8 వరకు జరిగే ఆసియా గేమ్స్లో 45 దేశాల నుంచి 12 వేల మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు.
హాంగ్జౌ: ఆసియా ఆటల పండుగ ఆరంభమైంది. కరోనా కారణంగా ఏడాది ఆలస్యంగా వచ్చిన 19వ ఆసియా గేమ్స్ చైనాలోని హాంగ్జౌలో ఘనంగా మొదలయ్యాయి. కృత్రిమ మేధస్సు, పర్యావరణ అనుకూల టెక్నాలజీని మిళితం చేస్తూ, భవిష్యత్తును కళ్లకు కడుతూ శనివారం జరిగిన ఓపెనింగ్ సెర్మనీ అందరినీ కట్టి పడేసింది. అరుణాచల్ప్రదేశ్కు చెందిన ముగ్గురు ఉషు ప్లేయర్లకు వీసా నిరాకరించడంతో ఇండియా–చైనా మధ్య దౌత్యపర వివాదం నడుమ టెక్నాలజీ, తమ దేశ సాంస్కృతిక చరిత్ర, ఆసియా ఖండం ఐక్యతా స్ఫూర్తిని చాటి చెప్పేలా నిర్వహించిన ఆరంభ వేడుకలతో ఆతిథ్య చైనా తన మార్కు చూపెట్టింది. ప్రేక్షకులతో కిక్కిరిసి, కలర్ఫుల్గా వెలిగిపోయిన 'బిగ్ లోటస్' స్టేడియంలో చైనా ప్రెసిడెంట్ జి జిన్పింగ్ గేమ్స్ను అధికారికంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇండియా సహా అన్ని దేశాల అథ్లెట్లను అభిమానులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్ సింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) హెడ్ థామస్ బాచ్, పలు దేశాధినేతలు, నేషనల్ ఒలింపిక్ కమిటీల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబర్ 8 వరకు జరిగే మెగా ఈవెంట్లో 45 దేశాల నుంచి 12 వేల మందికి పైగా అథ్లెట్లు పోటీ పడుతున్నారు
ఎనిమిదో ప్లేస్లో నడిచిన ఇండియా
మార్చ్ ఫాస్ట్లో ఫ్లాగ్బేరర్లు హర్మన్ప్రీత్ సింగ్, లవ్లీనా బొర్గొహైన్ సమక్షంలో దాదాపు వంద మంది ఇండియా అథ్లెట్లు, అధికారులు స్టేడియంలోకి రాగానే అభిమానులు బిగ్గరగా అరుస్తూ స్వాగతం పలికారు. పరేడ్లో ఇండియా ఎనిమిదో స్థానంలో నడిచింది. అబ్బాయిలు బంద్గాలా జాకెట్, ఖాకీ కలర్ కుర్తా వేసుకోగా.. అమ్మాయిలు నెక్ బ్లౌజ్, రీసైకిల్ చేసిన బట్టలతో తయారు చేసిన ఖాకీ- కలర్ చీరలు ధరించారు. ఉషు ప్లేయర్లకు చైనా ప్రభుత్వం వీసా నిరాకరించడానికి నిరసనగా ఇండియా స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ తన హాంగ్జౌ టూర్ రద్దు చేసుకుకోగా.. పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా పరాగ్వేలో ఉన్నందున ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష కూడా ఈ ఈవెంట్కు రాలేదు. ఇతర అధికారులు వేడుకలో పాల్గొన్నారు.
నేటి నుంచి పతకాల వేట
మెగా ఈవెంట్లో ఆదివారం ఇండియా అథ్లెట్లు తమ పతకాల వేట మొదలు పెట్టనున్నారు. షూటింగ్, బాక్సింగ్, చెస్, టెన్నిస్, హాకీ వంటి మెయిన్ ఈవెంట్లలో ఇండియా పోటీ ఆరంభించనుంది. షూటింగ్, రోయింగ్ నుంచి ఇండియాకు తొలి మెడల్ వచ్చే అవకాశం ఉంది.
టెక్నాలజీ.. ట్రెడిషన్తో థ్రిల్లింగ్ షో
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఓపెనింగ్ సెర్మనీ అందరినీ థ్రిల్ చేసింది. ‘టైడ్స్ సర్జింగ్ ఇన్ ఆసియా’ అనే మెయిన్ థీమ్కు అనుగుణంగా కొత్త యుగంలో చైనా, ఆసియా, ప్రపంచాన్ని మిళితం చేయడంతో పాటు ఆసియా ప్రజల ఐక్యత, స్నేహాన్ని చూపెట్టే ప్రదర్శనలు నిర్వహించారు. టెక్నాలజీలో ముందుండే చైనా 3డి డ్యుయల్ టెక్నాలజీని తొలిసారి ఓ స్పోర్ట్స్ స్టేడియంలో ఉపయోగించింది. దాని ద్వారా హాంగ్జౌ మీదుగా ప్రవహించే కియాంటాంగ్ నది అలలను స్టేడియంలోని ఎల్ఈడీ గ్రౌండ్ డిస్ప్లేలపై సృష్టించింది. అద్భుతమైన విజువల్స్తో తమ దేశ ట్రెడిషన్, కొత్త టెక్నాలజీని చైనా కళ్లకు కట్టింది. 30 నిమిషాల కల్చరర్ ప్రోగ్రామ్, లేజర్ షో ఆకట్టుకుంది. ఓ టార్చ్ బేరర్ నేరుగా, డిజిటల్ రూపంలోని మరో టార్చ్ బేరర్ వర్చువల్ రూపంలో ఆసియా గేమ్స్ జ్యోతిని వెలిగించారు. గ్రీన్ ఏషియన్ గేమ్స్ కాన్సెప్ట్లో భాగంగా ఈ వేడుకల్లో డిజిటల్ బాణాసంచా ఉపయోగించారు.
నేటి మెయిన్ ఈవెంట్స్
- రోయింగ్ ఫైనల్స్ (అర్జున్ లాల్–అర్వింగ్, పర్మిందర్– సత్నామ్) ఉ. 7.10 నుంచి
- షూటింగ్ క్వాలిఫికేషన్, ఫైనల్ (విమెన్స్ 10మీ. ఎయిర్ రైఫిల్ ) ఉ. 6 నుంచి
- బాక్సింగ్ తొలి రౌండ్ (నిఖత్x ఎన్గుయెన్) ఉ. 11.45
- విమెన్స్ క్రికెట్ సెమీస్ (ఇండియాx బంగ్లాదేశ్) ఉ. 6.30
- మెన్స్ హాకీ గ్రూప్ స్టేజ్ (ఇండియాxఉజ్బెకిస్తాన్) ఉ. 8.45 నుంచి
ప్రిక్వార్టర్స్లో టీటీ జట్లు
ఇండియా మెన్స్, విమెన్స్ టేబుల్ టెన్నిస్ జట్లు ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాయి. శనివారం జరిగిన గ్రూప్–ఎఫ్ మ్యాచ్లో ఇండియా మెన్స్ టీమ్ 3–0తో తజకిస్తాన్పై నెగ్గింది. తొలి మ్యాచ్లో మానవ్ ఠక్కర్ 11–8, 11–5, 11–8తో అఫ్జల్కోన్ మహ్ముదోవ్పై గెలవగా, మనుష్ షా 13–11, 11–7, 11–5తో ఉబైదుల్లో సుల్తోనోను ఓడించాడు. మూడో మ్యాచ్లో హర్మీత్ దేశాయ్ 11–1, 11–3, 11–5తో ఇబ్రోఖిమ్ ఇస్మోయిల్జోడాపై నెగ్గాడు. విమెన్స్లో ఇండియా 3–0తో నేపాల్ను ఓడించింది.