న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఇండియన్ అన్ క్యాప్డ్ ప్లేయర్ మంగేష్ యాదవ్ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన ఈ యంగ్ పేసర్ను ఏకంగా రూ.5.2 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. మంగేష్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ తీవ్రంగా పోటీ పడింది.
ఇరు ప్రాంఛైజీలు పోటా పోటీగా ధర పెంచుకుంటూ పోవడంతో రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మంగేష్ రూ.5 కోట్లు దాటాడు. రూ.5.2 కోట్ల దగ్గర ఎస్ఆర్హెచ్ డ్రాప్ కావడంతో అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్కు ఆర్సీబీ ఇంత భారీ ధర వెచ్చించడంతో ఎవరీ మంగేష్ యాదవ్ అనే డిస్కషన్ మొదలైంది.
మంగేష్ యాదవ్ బ్యాగ్రౌండ్:
మధ్యప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల మంగేష్ యాదవ్ లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పదునైన యార్కర్లతో బ్యా్టర్లను ఇబ్బంది పెట్టగలడు. బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం కూడా ఉంది. యశ్ దయాల్కు బ్యాకప్గా ఈ లెఫ్టార్మ్ యార్కర్ స్పెషలిస్ట్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్ టీ20 లీగ్లో గ్వాలియర్ చీతాస్ తరఫున 21 ఓవర్లలో 14 వికెట్లు పడగొట్టి లీగ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
ఎంపీ టీ20 లీగ్లో తన అద్భుత ప్రదర్శనతో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరఫున మంగేష్ అరంగేట్రం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రాణించి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. ఈ క్రమంలోనే మంగేష్పై కన్నేసిన ఆర్సీబీ ఎట్టకేలకు వేలంలో రూ.5.2 కోట్ల వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.
