వికారాబాద్ జిల్లాలో కురిసిన అకాల వడగండ్ల వానలకు మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన రాళ్ల వానకు మామిడి పిందెలు, కాయలు పెద్ద ఎత్తున రాలిపోయి, రైతులకు తీరని నష్టం కలిగించాయి. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో గురువారం(మార్చి 19) కురిసిన వర్షాలు రైతులకు ముఖ్యంగా తోట యజమానులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వడగళ్ల వర్షంతో దోమ మండలంలోని పోతిరెడ్డిపల్లి, బొంపల్లిలలో భారీగా వడగళ్లు పడ్డాయి. దీంతో మామిడి తోటల్లో పిందెలు, కాయలు పెద్ద ఎత్తున రాలిపోయాయి.
ఈదురు గాలులకు చెట్లు విరిగిపడటంతో పాటు మామిడి కొమ్మలు విరిగిపడ్డాయి. మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడితో పాటు కూరగాయలు, మొక్కజొన్న పంటలకు కూడా ఈ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.
