హైదరాబాద్: గీతం వర్శిటీ విద్యుత్ బకాయిలు చూసి తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యపోయింది. ఏకంగా రూ.118 కోట్లు బకాయి ఉండటంపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు.. అదే సామాన్యులైతే రూ.1000 చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని అధికారులను ప్రశ్నించింది.
కాగా, ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు కట్టని గీతం యూనివర్సిటీకు ఎస్పీడీసీఎల్ నోటీసులు పంపింది. ఎస్పీడీసీఎల్ నోటీసులను సవాల్ చేస్తూ గీతం వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం (డిసెంబర్ 16) ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక 2008 నుంచి గీతం వర్శిటీ కరెంట్ బిల్లు చెల్లించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏకంగా రూ.118 కోట్ల విద్యుత్ బకాయిలు ఉండటం చూసి నివ్వెరపోయారు. సామాన్యులకైతే రూ.1000 చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు.
