YS Jagan-Vijay: ఒకే వేదికపై సీఎం స్టాలిన్, జగన్, విజయ్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా భేటీ.!

YS Jagan-Vijay: ఒకే వేదికపై సీఎం స్టాలిన్, జగన్, విజయ్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా భేటీ.!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు టీవీకే (TVK) అధినేత,  దళపతి విజయ్ కలిశారు.  చెన్నైలో వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డి తనయుడు సాహిల్ రెడ్డి వివాహ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలలో హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.  ఈ సందర్భంగా ఒకే ఫ్రేమ్ లో వైఎస్ జగన్, విజయ్ కనిపించడం, దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట షేక్ చేస్తున్నాయి.

ఒకే వేదికపై 'జన నాయకులు'

వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డి తనయుడు సాహిల్ రెడ్డి వివాహ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన దళపతి విజయ్, జగన్ పక్కపక్కనే కూర్చుని ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఇద్దరూ చిరునవ్వుతో మాట్లాడుకుంటున్న దృశ్యాలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా బలం ఉన్న నాయకుడిగా జగన్, తమిళనాడులో మార్పు కోసం పోరాడుతున్న నాయకుడిగా విజయ్.. ఇలా ఇద్దరు మాస్ లీడర్లు కలవడంతో సోషల్ మీడియాలో "జన నాయకుడితో జన నాయగన్" అంటూ పోస్టులు హోరెత్తుతున్నాయి.

పొలిటికల్ అండ్ సినీ గ్లామర్

ఈ వేడుక కేవలం జగన్-విజయ్ భేటీకే పరిమితం కాలేదు. అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్వయంగా విచ్చేసి జగన్‌ను ఆత్మీయంగా హత్తుకున్నారు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ,  టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంటి ప్రముఖులు కూడా జగన్‌ను కలిశారు. దశాబ్దాల నాటి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ వారంతా గడిపిన క్షణాలు ఇప్పుడు వైరల్ వీడియోలుగా మారాయి.

 

ఆసక్తికర చర్చలు

ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ తన పోరాటాన్ని కొనసాగిస్తుండగా, మరోపక్క విజయ్ తన కొత్త పార్టీతో తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ కేవలం మర్యాదపూర్వకంగానే జరిగినా..  ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏది ఏమైనా, వైట్ అండ్ వైట్ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ హేమాహేమీల కలయిక ఈ వివాహ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.