- జిల్లా ఎన్నికల అధికారి కె.హరిత
ఆసిఫాబాద్, వెలుగు: ప్రఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పకడ్బందీగా చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్, బూత్ స్థాయి అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై రివ్యూ నిర్వహించారు. సమగ్ర సవరణ మ్యాపింగ్ ఎలాంటి పొరపాట్లు లేకుండా చేపట్టాలన్నారు. 2002లో ఓటరు జాబితాలో పేరు ఉండి 2025 ఓటరు జాబితాలోనూ అదే పేరు ఉండి వారికుటుంబ సభ్యులు, కూతుర్లు, కొడుకుల పేర్లు కొత్త జాబితాలో ఉంటే మ్యాపింగ్ చేయాలన్నారు.
బూత్ స్థాయి అధికారులు తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని, బీఎల్ వో సూపర్ వైజర్లు, తహసీల్దార్లు పర్యవేక్షించాలని, సమగ్ర సవరణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలన్నారు. అనంతరం తహసీల్దార్లతో భూభారతి, రెవెన్యూ సదస్సులు, సాదాబైనామాలపై సమీక్షించారు. భూ భారతిలో పట్టా మార్పిడి, విరాసత్ కొరకు వచ్చే దరఖాస్తులు, గత రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెళ్లి రికార్డులు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
