
తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని.. రామరాజ్యం ఏర్పాటే తమ లక్ష్యమని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కరీంనగర్ లో హిందూ ఏక్తాయాత్రలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని చెప్పారు. ఓవైసీ బెదిరింపులకు ఎవరూ భయపడబోరని.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని సవాల్ విసిరారు. ఓవైసీ ఇంట్లోకి కూడా వస్తా ఏం చేస్తాడో చూస్తానన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని విమర్శించారు. అసోంలో 6 వేల మదర్సాలనూ బంద్ చేయించామని.. వచ్చే ఏడాది మరో 1000 మదర్సాలనూ మూసివేస్తామన్నారు.
ధనిక రాష్ట్రం అయిన తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఎందుకున్నాయని ప్రశ్నించారు హిమంత బిశ్వ శర్మ. అసోంలో లీటర్ డీజిల్ 92 రూపాయలే ఉందన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలివ్వడం లేదని.. బీజేపీ ప్రభుత్వం రాగానే ఒకటో తారీఖునే జీతాలిస్తామని.. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ సర్కార్ పేరు ఢిల్లీలో మారుమోగుతోందని.. బీఆర్ఎస్ పెద్దలు లిక్కర్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వీఆర్ఎస్ తప్పదన్నారు.
భారత్ లో సివిల్ కోడ్ యూనిఫామ్ అమలు చేస్తామని హిమంత బిశ్వ శర్మ అన్నారు. భారత్ ను ఎవ్వరూ భయపెట్టలేరని.. జమ్మూకశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దుచేశామని చెప్పారు. కేరళ స్టోరీని సెక్యులర్ వాదులు వ్యతిరేకిస్తున్నారని.. ఒక్కసారి వాళ్లు అస్సాం వచ్చి చూస్తే అర్థమవుతుందన్నారు. తాను అసోం వెళ్లి తెలంగాణలో మార్పు మొదలైందని చెప్తానన్నారు. మోడీ పేద ప్రజల అభివృద్ది కోసం కష్టపడుతున్నారని తెలిపారు.3
కర్ణాటకలో పాకిస్తాన్ నినాదాలు: బండి సంజయ్
హిందూ సంఘటితం కోసమే ఏక్తాయాత్ర అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. హిందూ ఏక్తాయాత్ర ఎవరీకీ వ్యతిరేకం కాదని చెప్పారు. కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో హిందువులంతా జాగృతం కావాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఎవరి జాగీరని అమలు చేస్తారని ప్రశ్నించారు బండి సంజయ్. హిందూవులపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని చెప్పారు.