అసెంబ్లీ సమావేశాల తీరు మార్చేసిన కరోనా
సీరియస్ వాతావరణంలో సభ
సోమవారం అసెంబ్లీ సమావేశాలు కరోనా రూల్స్ నడుమ స్టార్టయినయ్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ముఖానికి మాస్కులు పెట్టుకొని వచ్చారు. అసెంబ్లీ హాల్ లో ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యేకు నడుమ ఇలా ఒక్కో సీటును ఖాళీగా వదిలిపెట్టారు. సీట్లో కూర్చున్న తర్వాత సభ వాయిదా పడే వరకు ఎమ్మెల్యేలు సీట్ల నుంచి కదలలేదు. ఒకరికొకరు దూరం నుంచే దండం పెడుతూ పలకరించుకున్నారు.
సీఎం కేసీఆర్ మెడలో శెల్ల వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. మాట్లాడుతున్నంత సేపు ఆయన ఇలా మాటిమాటికి శెల్లను అడ్డు పెట్టుకుంటూ కనిపించారు.
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలంటే హడావుడి మామూలుగా ఉండదు. పార్టీల దగ్గర నుంచి మీడియా వరకు అసెంబ్లీ దగ్గర అంతా సందడి సందడిగా కనబడుతుంది. పార్టీలతో సంబంధం లేకుండా నేతల షేక్ హ్యాండ్లు, ఆలింగనాలుంటయ్. సభ్యులంతా జోష్ గా జోక్ లేసుకుంటూ కనిపిస్తరు. మీడియా పాయింట్ దగ్గర వాడివేడి మాటలుంటయ్ . కానీ కరోనాతో ఈసారి సీన్ మారిపోయింది. అసెంబ్లీ సీరియస్ అయిపోయింది. వాయిదా పడే వరకూ గంభీరంగానే సభ నడిచింది. ఒక్కో సీటుకు ఒక్కరే కూర్చున్న మెంబర్లు వాళ్ల సీట్ల నుంచి కదల్లేదు. మెంబర్లందరూ మాస్కులతో, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కనిపించారు. తోటి మెంబర్ల దగ్గరకు వెళ్లకుండా దండం పెట్టే పలకరించారు.
కొవిడ్ రూల్స్ ప్రకారమే..
కొవిడ్ రూల్స్ ప్రకారమే అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఆవరణలో కొన్ని చోట్ల హ్యాండ్ శానిటైజర్లు అందు బాటులో ఉంచారు. అధికారులు, పోలీసులు, మీడియాను థర్మల్ గన్స్తో చెక్ చేశాకే సభా ప్రాంగణంలో కి పర్మిషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే లతో పాటు హౌస్ లోపలికి వెళ్లే సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్, ఆక్సిజన్ లెవల్స్ను పరీక్షించారు. ప్రెస్ గ్యాలరీతో పాటు వీఐపీ, విజిటర్స్ గ్యాలరీల్లోనూ మీడియాకు సీట్లు కేటాయించారు. హౌస్లో ఒక్కో సభ్యుడి మధ్య 6 అడుగుల దూరం పాటించినట్టే మీడియా గ్యాలరీలోనూ భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఎమ్మెల్యేకూ మాస్క్లు, శానిటైజర్లతో కొవిడ్ కిట్ అందజేశారు.
సర్జికల్ మాస్క్ .. సిరిశెల్లతో కేసీఆర్
సర్జికల్ మాస్క్, మెడలో సిరిశెల్లతో సభలోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మాస్క్ తీసేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతా ప తీర్మానం ప్రవేశపెట్టే టైంలో మాస్క్ను పక్కన పెట్టి మెడలోని సిరిశెల్లను నోరు, ముక్కుకు సీఎం అడ్డం పెట్టుకున్నారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ మాత్రమే మాట్లాడే టైమ్లో మాస్క్ ఉంచుకోగా మిగతా మంత్రులు మాస్కులు తీసేసి మాట్లాడారు. కొందరు సభ్యులు కూడా మాస్క్లు తొలగించి సంతాప తీర్మానాలపై చర్చలో పాల్గొన్నారు.
కొవిడ్ తో హరీశ్ దూరం
కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలకు ఆర్థిక మంత్రి హరీశ్ రా వు దూరంగా ఉన్నారు. తనకు పాజిటివ్ తేలినట్టు కొన్ని రోజుల క్రితమే హరీశ్ స్వయంగా ప్రకటించారు. కరోనా నుంచి కోలుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తొలిరోజు అసెంబ్లీకి హాజరు కాలేదు. కోలుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సంతాప తీర్మానాలపై చర్చలో పాల్గొన్నారు.
మీడియా పాయింట్ వెలవెల
ఈసారి కొవిడ్ వల్ల మీడియా పాయింట్ కు అనుమతివ్వకపోవడంతో ఆ ప్రాంగణమంతా నిశ్శబ్దంగా మారింది. లైవ్ టెలీ కాస్ట్ చేసే సిబ్బంది, నలుగురైదుగురు పోలీసులు తప్ప అక్కడ ఎవరూ కనిపిం చలేదు. అసెంబ్లీ లాబీలతో పాటు లెజిస్లేటి వ్ పార్టీ ఆఫీసుల్లోకి మీడియాను అనుమతించలేదు. ఒక్కో మీడియా ఆర్గనైజేషన్ నుంచి ఒకరు చొప్పున అసెంబ్లీ, కౌన్సిల్ గ్యాలరీలోకి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు. ప్రింట్ మీడియాకు ప్రెస్ గ్యాలరీ కేటాయించగా ఎలక్ట్రానిక్ మీడియాకు వీఐపీ, విజిటర్స్ గ్యాలరీల్లో సీటింగ్ ఏర్పాటు చేశారు.
ఐదుగురు ఎమ్మెల్యేలు ఆబ్సెంట్
టీఆర్ఎస్కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు చెందిన ఓ ఎమ్మెల్యే తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. వీరిలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ , వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ , ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కాంగ్రెస్ నేత, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నారు. వీరంతా వివిధ కారణాలతో సమావేశాలకు హాజరుకాలేదు.