- అంతర్జాతీయ ముఠాలతో కలిసి హైదరాబాద్, కంబోడియాలో కాల్ సెంటర్లు
- గేమింగ్, బెట్టింగ్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు
- నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి.. వాళ్లతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్
- సైబర్ ఫ్రాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిల్లోకి ట్రాన్స్ఫర్
- మొత్తం 24 మందిపై కేసు.. 18 మంది అరెస్టు
- పరారీలో ప్రధాన నిందితులు సహా మరికొందరు
ఖమ్మం/ పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరు పోలీస్ స్టేషన్లో ఒక నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో విస్తుగొలిపే స్కామ్ బయటపడింది. ఇక్కడ తీగ లాగితే అంతర్జాతీయ స్థాయిలో రూ.547 కోట్ల విలువైన సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. నిందితులు కుబేర సినిమా తరహాలో అమాయకులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి, వాటి ద్వారా రూ.కోట్లలో ట్రాన్సాక్షన్స్ చేశారు. విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ, సైబర్ ఫ్రాడ్స్కు పాల్పడి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. అలాంటి ఓ పెద్ద ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు.. 18 మందిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్సునీల్దత్ప్రకటించారు. ఆదివారం వీఎం బంజరు పోలీస్స్టేషన్లో ప్రెస్మీట్ పెట్టి, ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఉద్యోగాల పేరుతో నమ్మించి..
సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు మండలాలకు చెందిన పోట్రు మనోజ్ కల్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీశ్, మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులు సత్తుపల్లి ఏరియాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపారు. ఉద్యోగం ఇచ్చినట్టు నమ్మించి, వారి పేర్లతో హెచ్డీఎఫ్సీ, సౌత్ ఇండియన్ బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్స్ఓపెన్ చేయించారు. ఆ అకౌంట్లకు సంబంధించిన బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ను తీసుకుని, అదే అకౌంట్లో సైబర్ క్రైమ్స్ ద్వారా సంపాదించిన రూ.కోట్లు జమ చేశారు. నిందితులు తమ ఏజెంట్ అయిన వేంసూరు మండలం లింగపాలెంకి చెందిన జొన్నలగడ్డ తిరుమల సాయి, సత్తుపల్లికి చెందిన బాడిస మురళి, మరికొందరి ద్వారా నిరుద్యోగ యువకులను, రైతులను గుర్తించి .. ట్రేడింగ్ చేసుకోవడానికి ఆదాయ పన్ను ఇబ్బందులు ఉన్నాయని తమకు అకౌంట్లు కావాల్సి ఉందని నమ్మించారు. ఒక్కో సేవింగ్ అకౌంటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు, కరెంటు అకౌంట్కు రూ.10 వేల వరకు ఇచ్చి కొందరితో అకౌంట్లను ఓపెన్ చేయించుకున్నారు. అకౌంట్కు సంబంధించిన కిట్ రాగానే వారే తీసుకుని, సైబర్ నేరాలకు వాడుకునేవారని దర్యాప్తులో తేలింది. కొద్ది రోజుల కింద హైదరాబాద్లో ఓ వ్యక్తిని పెట్టుబడుల పేరుతో రూ.14 కోట్లు మోసం చేసిన కేసులో అరెస్టు చేసిన గనిపిశెట్టి నాగ బ్రహ్మనాయుడు, తాటికొండ పవన్ కల్యాణ్, దాసరి మునిరామ్, జవ్వాజి హరికృష్ణతో పాటు బాడిశ మురళి అతని భార్య నాగలక్ష్మి, చిటికుల సందీప్ తదితరులు వీరికి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి సహకరించినట్లు విచారణలో తెలిసింది.
టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి, అకౌంట్లలో డబ్బులు కొట్టేసి..!
ఈ కేసులో ప్రధాన నిందితులు.. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టారు. కంబోడియా, హైదరాబాద్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ వాటి ద్వారా మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడేవారు. బాధితులు ఎవరైనా వీరి మాటలకు ఆకర్షితులైతే వారిని టెలిగ్రామ్ గ్రూపులలో సభ్యునిగా చేర్చి, తరువాత వారికి మోసపూరిత లింకులు, ఏపీకే ఫైల్స్ పంపి వారి అకౌంట్లో నుంచి డబ్బులు కాజేసేవారు. ఆస్ట్రేలియా సిటిజన్స్ తో పాటు, మన దేశంలోని పలు రాష్ట్రాల్లో అమాయకులను ఇలా మోసం చేశారని పోలీస్ఎంక్వైరీలో గుర్తించారు. సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన సొత్తును మొదట వీరి ఏజెంట్ల ద్వారా తెరిపించిన బ్యాంక్ అకౌంట్లోకి మళ్లించి, ఆ తరువాత కరెంట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి, ఆ డబ్బును చైనీస్ ఏజెంట్లు, కంబోడియా ఏజెంట్ల ద్వారా యూఎస్ డాలర్, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చినట్లు దర్యాప్తులో తేలింది. విచారణలో నేరస్తులు వాడిన బ్యాంక్ అకౌంట్లను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ తో పరిశీలించినప్పుడు సదరు బ్యాంకు అకౌంట్లపైన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వందల సంఖ్యలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు ఉన్నట్లు బయటపడింది.
స్కామ్ బయటపడిందిలా..
సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగు సాయికిరణ్ అనే యువకుడు గతేడాది డిసెంబర్ 24న తన ఖాతాలో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్టు వీఎం బంజరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. సాయికిరణ్తో 2022లో సైబర్ నేరగాళ్లు పోట్రు మనోజ్ కల్యాణ్, పోట్రు ప్రవీణ్, ఉడతనేని వికాస్ చౌదరి, మోరంపూడి చెన్నకేశవులు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. వాటి ఆన్లైన్ వివరాలను సాయికిరణ్కు ఇవ్వకుండా నిందితులే తీసుకున్నారు. ఆ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు అనుమానించిన సాయికిరణ్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో 15 రోజుల కింద పోట్రు ప్రవీణ్ను వీఎం బంజర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రెండుసార్లు పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించి, సైబర్ క్రైమ్ ముఠా వివరాలు సేకరించారు.
రూ.వందల కోట్లలో లావాదేవీలు..!
కేసు విచారణలో భాగంగా నిందితులైన ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కల్యాణ్ కుటుంబ సభ్యులు, అనుచరుల బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. పోట్రు మనోజ్ కల్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ.114.18 కోట్లు, అతని భార్య మేడా భానుప్రియ ఖాతాల్లో రూ.45.62 కోట్లు, మనోజ్ కల్యాణ్ బామ్మర్ది మేడా సతీశ్ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ. 81.72 కోట్లు, కరీంనగర్కు చెందిన తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందిన నరసింహ కిరాణం అండ్ డెయిరీ ఖాతాలో రూ. 92.54 కోట్లు, ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో రూ. 80.41 కోట్ల చొప్పున లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన పోట్రు ప్రవీణ్తో పాటు వీరికి సహకరించి బ్యాంకు అకౌంట్లను ఇచ్చిన 18 మంది వ్యక్తులను వీఎం బంజరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సహకరించినందుకు సదాశివపాలెం, సీతారాంపురం, రామానగరం, తుంబూరు గ్రామాలకు చెందిన జుంజునూరి శివక్రిష్ణ, వడ్లమూడి నరేంద్ర, మల్లాది శివ, సాధు పవన సందీప్, సాదు సంధ్య, సాధు లేఖలను అరెస్ట్ చేశారు. లింగపాలెం గ్రామానికి చెందిన జొన్నాదుల తిరుమల, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేశ్, గోళ్లమూడి నాగముఖేశ్, కంచపోగు శ్రీనివాస్, రాయల అజయ్ కుమార్, రాయల గోపి, పల్లా గణేష్, రాయల గోపిచంద్, కందుకూరి జగదీశ్, కరీంగనర్కు చెందిన తాటికొండ రాజులను కూడా అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కల్యాణ్, అతని భార్య మేడా భానుప్రియ, మేడా సతీశ్ పరారీలో ఉన్నారని.. వారిని త్వరలో పట్టుకుంటామని సీపీ తెలిపారు.
