
- అక్రమంగా జేసీబీలతో షాపులు కూల్చేశారంటున్న షాపు ఓనర్లు
- కోర్టును ఆశ్రయిస్తామంటున్న బాధితులు
అశ్వారావుపేట, వెలుగు: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా ఆర్అండ్ బీ అధికారులు సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైన్స్, రింగ్ రోడ్డు పనులను చేపట్టారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రింగ్ రోడ్డు రావడంతో అధికారులు రోడ్డు పక్కన 50 అడుగులను తీసి షాపులను ఖాళీ చేపించారు. అయితే తమ భూములకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయని, పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని షాప్ ఓనర్లు పనులు అడ్డుకున్నారు. ఇదిలాఉంటే ఫారెస్ట్ చెక్ పోస్ట్, గార్డ్ క్వార్టర్ కోసం గతంలో తగరం నాగయ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సర్వే నంబర్ 1167లో ఎకరానికి పైగా భూమి విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో ఫారెస్ట్ చెక్పోస్ట్, గార్డ్ క్వార్టర్ ఉండేవి. చెక్పోస్ట్ తొలగించడం, క్వార్టర్ శిథిలం కావడంతో కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు, షాపు కట్టుకున్నారు.
ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఈ క్రమంలో తహసీల్దార్ రామకృష్ణ శుక్రవారం ఎఫ్ఆర్వో మురళికి భూమికి సంబంధించిన పత్రాలను అందజేయడంతో ఫారెస్ట్ సిబ్బంది అక్రమంగా నిర్మించిన షాపులు, ఇంటిని జేసీబీతో తొలగించారు. ఫారెస్ట్ ఆఫీసర్లు, బాధితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
పోలీస్ ప్రొటెక్షన్ తో ఫారెస్ట్ సిబ్బంది షాప్ను, ఇల్లును పూర్తిగా తొలగించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సామాను సర్దుకునే అవకాశం ఇవ్వకుండా తమను దౌర్జన్యంగా ఖాళీ చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కోర్టులో ఉండగా, అవేమి పట్టించుకోకుండా ఫారెస్ట్, పోలీస్ అధికారులు వ్యవహరించారని పేర్కొన్నారు. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద తాము కోర్టుకు వెళ్తామని బాధితులు తెలిపారు.