
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడ్డ వాళ్లు సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. అమెరికాలోని వాషింగ్టన్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. విదేశాల్లో గొప్ప స్థానాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఆటా మహాసభల్లో తొలిసారిగా తెలంగాణ పెవిలియను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తెలియజేసేందుకు ఆటా మహాసభలు వేదికగా నిలిచాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య , గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, గువ్వల బాలరాజు, చంటి క్రాంతి కిరణ్, బొల్లం మల్లయ్య , టిఎస్ఐఐసి ఛైర్మన్ గాదరి బాలమల్లు, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తదితరులు పాల్గొన్నారు.