
పర్వతగిరి(సంగెం), వెలుగు: ఆస్తి ఇవ్వడం లేదని నిద్రపోతున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని సాంబయ్య, వినోదకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా, ఓ కొడుకు చాలా రోజుల కింద చనిపోయాడు. ఈక్రమంలో ఇటీవల టెక్స్టైల్ పార్కులో వీరి భూమి కోల్పోవడంతో డబ్బులు వచ్చాయి. తల్లి ఆ డబ్బులు తనకు ఇవ్వకుండా, కూతురికే ఇస్తుందనే కారణంతో కొడుకు సతీశ్ తల్లిదండ్రులతో తరచూ గొడవ పడేవాడు.
సతీశ్ నర్సంపేటలో ఉంటూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి నిద్రపోతున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వినోద 80 శాతం వరకు కాలిపోగా, చికిత్స కోసం స్థానికులు ఆమెను 108లో వరంగల్ ఎంజీఎం కు తరలించారు. ప్రస్తుతం సతీశ్ పరారీలో ఉండగా, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.