విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పై హత్యయత్నం..ఆస్పత్రికి తరలింపు

విజయవాడ దుర్గగుడి ఛైర్మన్ పై హత్యయత్నం..ఆస్పత్రికి తరలింపు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఛైర్మన్‌ కర్నాటి రాంబాబుపై దాడి కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై దాడి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మద్యం మత్తులో ఉన్న దుండుగుడు రాంబాబుపై బీర్ బాటిల్‌తో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో రాంబాబుకు పొట్ట భాగంలో తీవ్ర గాయమైంది. ఆయన వెంట ఉన్న బంధువులు దుండగున్ని అడ్డుకుని.. రాంబాబును హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించగా.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు చెప్తున్నారు.

 రాంబాబు తండ్రి ఈ మధ్యే మరణించగా.. ఆయన సమాధి వద్ద దీపం పెట్టి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ దుండగుడు ఒక్కసారిగా వెనుక నుంచి దాడికి పాల్పడ్డాడు. అయితే దాడిని పసిగట్టిన రాంబాబు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగుని చేతిలో ఉన్న బీర్ బాటిల్ రాంబాబు పొట్టలో గుచ్చుకుంది. ఆయన వెంట ఉన్న బంధువులు ఆ నిందితుడిని  పట్టుకున్నారు. అనంతరం రక్తస్రావం అవుతున్న రాంబాబును వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనను పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనకు సంబంధించి విజయవాడ కమిషనర్‌.. రాంబాబుకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ దుండగుడు ఎవరు.. రాంబాబుపై ఎందుకు దాడి చేశాడు.. అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు