చోరీకి వెళ్లి గర్భిణిపై హత్యాయత్నం..ఏమీ తెలియనట్లు డయల్ 100కు ఫోన్

చోరీకి వెళ్లి గర్భిణిపై హత్యాయత్నం..ఏమీ తెలియనట్లు డయల్ 100కు ఫోన్
  • నమ్మకంగా నటిస్తూ మరో రెండు ఇండ్లలో దొంగతనం
  • ఆ తరువాత బాధితులతో కలిసి పోలీసులకు కంప్లైంట్
  • నిందితుడిని అరెస్ట్  చేసిన కమలాపూర్  పోలీసులు

హనుమకొండ/కమలాపూర్, వెలుగు: వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడు.. వారం రోజుల కింద ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. ఇంట్లో ఉన్న గర్భిణి గమనించడంతో ఆమెను హత్య చేసేందుకు కొడవలితో దాడి చేశాడు.  చనిపోయిందనుకుని ఆమె ఒంటిపై నగలతో పరారయ్యాడు. 

అనంతరం ఏమీ తెలియనట్లు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి డయల్ 100కు కాల్  చేశాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, చనిపోయిందనుకున్న గర్భిణి కాస్త స్పృహలోకి రావడంతో యువకుడి బండారం బయటపడింది. విచారణ చేపట్టిన పోలీసులు యువకుడిని శుక్రవారం అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించారు. బాధితులు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్  మండలం వంగపల్లి గ్రామానికి చెందిన చిలువేరు ప్రశాంత్  ఆన్ లైన్  గేమ్ లకు అలవాటు పడి నష్టపోయాడు. జల్సాల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు దొంగతనాలకు అలవాటుపడ్డాడు. 

వంగపల్లి గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూనే వారిండ్లలో చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. ఇలా కొద్దిరోజుల కింద తన దగ్గరి మిత్రుడైన కొడెపాక మధుసూదన్  ఇంట్లో చోరీకి పాల్పడి రూ.60 వేల విలువ చేసే బంగారం ఎత్తుకెళ్లాడు. ఆ తరువాత పశువుల రమాదేవి ఇంటికి తాళం వేసి ఉండగా.. అందులో చొరబడి రూ.2 లక్షల విలువ చేసే నగలు దోచుకెళ్లాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా  బాధితులతో కలిసి కమలాపూర్  స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. 

గర్భిణిపై దాడి చేసి.. 

చోరీలకు అలవాటు పడిన చిలువేరు ప్రశాంత్  మే 30న ఎలుకటి దిలీప్  ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఆ సమయంలో దివ్య అతడిని గమనించింది. దీంతో తన బాగోతం బయటపడుతుందని భావించిన ప్రశాంత్.. ఆమెను చంపేందుకు ప్రయత్నం చేశాడు. కొడవలితో తలపై దాడి చేసి, ఆమె చనిపోయిందనుకుని ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు వెనక్కి వచ్చి, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి డయల్ 100కు కాల్ చేశాడు. 

గాయపడిన గర్భిణిని గ్రామస్థులతో కలిసి కమలాపూర్  ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆసుపత్రికి వెళ్లాక స్పృహలోకి వచ్చిన గర్భిణి తనపై చిలువేరు ప్రశాంత్  దాడి చేసినట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం కమలాపూర్  పోలీసులు బస్టాండ్  సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. ప్రశాంత్  వారికి తారసపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.4.1 లక్షల విలువైన 8 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. వంగపల్లి గ్రామంలో వరుస చోరీల కేసును ఛేదించిన కమలాపూర్  సీఐ  హరికృష్ణ, ఎస్సై వీరభద్రం, పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.