- ఆటో డ్రైవర్ అరెస్టు, పరారీలో మరో నిందితుడు
కూకట్పల్లి, వెలుగు: నగదు చోరీ చేసిన కేసులో కేపీహెచ్బీ పోలీసులు ఓ ఆటో డ్రైవర్ను అరెస్టు చేశారు. అడ్డగుట్ట సొసైటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉత్తమ్కుమార్వర్మ(31) తన కారులో రూ.10 లక్షలు పెట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు. కేపీహెచ్బీకాలనీ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది.
ఆ సమయంలో అతని కారు వెనుక ఉన్న ఆటో డ్రైవర్ ముదావత్ శంకర్(26), మరో యువకుడు అభినయ్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చి ఉత్తమ్కుమార్ వర్మకు సాయం చేశారు. ప్రమాదానికి గురైన కారును సనత్నగర్లోని షోరూం వరకు తీసుకెళ్లగా తోడుగా వెళ్లారు.
ఆ తరువాత ఆటోలో ఉత్తమ్కుమార్ వర్మను అడ్డగుట్ట సొసైటీలోని ఇంటి వద్ద దించారు. తెలివిగా వర్మ బ్యాగ్ను వదిలి వెళ్లేటట్టు చేశారు. ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన వర్మ ఆటోడ్రైవర్కి ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, శుక్రవారం ఆటో డ్రైవర్ శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. రూ.5.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అభినయ్ పరారీలో ఉన్నాడు.
