
- అనరాక్ రిపోర్టు
న్యూఢిల్లీ : దేశంలోని ఏడు టాప్ సిటీలలో ఇండ్ల సగటు కిరాయిలు పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ సగటు కిరాయి ఈ ఏడాది జనవరి– సెప్టెంబర్ మధ్య కాలంలో 9 నుంచి 31 శాతం దాకా ఎగశాయి. బెంగళూరు సిటీలోనే కిరాయి భారీగా పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ రిలీజ్ చేసిన రిపోర్టు వెల్లడించింది. ఐటీ, ఐటీఈఎస్ హబ్లుగా ఎదిగిన బెంగళూరు, హైదరాబాద్, పుణె సిటీలలో ఇండ్ల కిరాయిల పెరుగుదల జోరందుకుందని పేర్కొంది.
బెంగళూరులోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇంటికి సగటు కిరాయి ఏకంగా 31 శాతం పెరిగిందని తెలిపింది. 2022 లో ఈ ప్రాంతంలో సగటు నెల కిరాయి రూ. 24,600 కాగా, ఈ ఏడాది మొదటి 9 నెలల్లో అది రూ. 28,500 కి చేరినట్లు వివరించింది. కొవిడ్ మహమ్మారి టైములో చాలా ప్రాంతాలలో కిరాయిలు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఆ తర్వాత బాగా పుంజుకున్నాయి.
హైదరాబాద్లో...
హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో సగటు నెల కిరాయి 2022 లోని రూ. 24,600 నుంచి 16 శాతం ఎక్కువై 2023 లో రూ. 28,500 కి చేరినట్లు అనరాక్ రిపోర్టు వెల్లడించింది. ఇదే కాలంలో గచ్చిబౌలిలో ఇండ్ల కిరాయి ఏకంగా 27 శాతం ఎగసినట్లు తెలిపింది.
పుణెలోని ముఖ్యమైన ప్రాంతాలలోనూ కిరాయిలు 17–18 శాతం పెరుగుదల రికార్డయినట్లు పేర్కొంది. చెన్నై సిటీలో రెంట్లు 9 నుంచి 12 శాతం పెరగ్గా, ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో 11 నుంచి 14 శాతం ఎక్కువైనట్లు అనరాక్ రిపోర్టు వెల్లడించింది.