ఏడు టాప్​ సిటీలలో..31 శాతం పెరిగిన కిరాయిలు

ఏడు టాప్​ సిటీలలో..31 శాతం పెరిగిన కిరాయిలు
  • అనరాక్ రిపోర్టు

న్యూఢిల్లీ : దేశంలోని ఏడు టాప్​ సిటీలలో ఇండ్ల  సగటు కిరాయిలు పెరిగాయి. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే రెండు బెడ్​రూమ్​ల ఫ్లాట్​ సగటు కిరాయి ఈ ఏడాది జనవరి– సెప్టెంబర్​ మధ్య కాలంలో  9 నుంచి 31 శాతం దాకా ఎగశాయి. బెంగళూరు సిటీలోనే కిరాయి భారీగా పెరిగినట్లు  రియల్​ ఎస్టేట్​ కన్సల్టెంట్​ కంపెనీ అనరాక్ రిలీజ్​ చేసిన​ రిపోర్టు వెల్లడించింది. ఐటీ, ఐటీఈఎస్​  హబ్​లుగా ఎదిగిన బెంగళూరు, హైదరాబాద్, పుణె సిటీలలో ఇండ్ల కిరాయిల పెరుగుదల జోరందుకుందని పేర్కొంది.

బెంగళూరులోని వైట్​ఫీల్డ్​ ప్రాంతంలో డబుల్​ బెడ్​రూమ్​ ఇంటికి సగటు కిరాయి ఏకంగా 31 శాతం పెరిగిందని తెలిపింది. 2022 లో ఈ ప్రాంతంలో  సగటు నెల కిరాయి రూ. 24,600 కాగా, ఈ ఏడాది మొదటి 9 నెలల్లో అది రూ. 28,500 కి చేరినట్లు వివరించింది. కొవిడ్‌‌​ మహమ్మారి టైములో చాలా ప్రాంతాలలో  కిరాయిలు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఆ తర్వాత బాగా పుంజుకున్నాయి.

హైదరాబాద్​లో...

హైదరాబాద్​ హైటెక్​ సిటీ ఏరియాలో సగటు నెల కిరాయి 2022 లోని రూ. 24,600 నుంచి 16 శాతం ఎక్కువై 2023 లో రూ. 28,500 కి చేరినట్లు అనరాక్​ రిపోర్టు వెల్లడించింది. ఇదే కాలంలో  గచ్చిబౌలిలో ఇండ్ల కిరాయి ఏకంగా 27 శాతం ఎగసినట్లు తెలిపింది.

పుణెలోని ముఖ్యమైన ప్రాంతాలలోనూ కిరాయిలు 17–18 శాతం  పెరుగుదల రికార్డయినట్లు పేర్కొంది. చెన్నై సిటీలో రెంట్​లు 9 నుంచి 12 శాతం పెరగ్గా, ఢిల్లీ–ఎన్​సీఆర్​ ప్రాంతంలో 11 నుంచి 14 శాతం ఎక్కువైనట్లు అనరాక్​ రిపోర్టు వెల్లడించింది.