
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని షెడ్యూల్ టైంలోనే పూర్తి చేస్తామని టెంపుల్ నిర్మాణ సంస్థలో పనిచేసే అధికారి ఒకరు తెలిపారు. గుడిని డిసెంబరు 2023 నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం టెంపుల్ నిర్మించే స్థలంలో ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు టెంపుల్లో దర్శనాలకు భక్తులను అనుమతించే అవకాశం ఉందన్నారు. ‘‘ఆగస్టు 27–29 మధ్య ఆలయ నిర్మాణంపై రివ్యూ మీటింగ్ జరిగింది. టెంపుల్ ఎక్కువకాలం స్ట్రాంగ్గా ఉండడానికి పూర్తిగా రాతితో నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థలంలో మట్టిని పరీక్షించిన తరువాత 12 అడుగుల లోతుకు పునాదులు తవ్వాలని నిర్ణయించాం. 2,500 సంవత్సరాల తరువాత వచ్చే భూకంపాలను కూడా తట్టుకుని నిలబడేలా ఫైనల్ డిజైన్ను రూర్కెలాలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించింది’’ అని అధికారి చెప్పారు. పునాదులను 18,500 స్క్వేర్ మీటర్ల రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ (ఇంజనీర్డ్ ఫిల్)తో నింపాలని ఎక్స్పర్ట్ కమిటీ సూచించింది. మొత్తం 44.5 లక్షల క్యూబిక్ అడుగుల ఇంజనీరింగ్ ఫిల్ను, మిగిలిన పరిమాణంలో మంచి క్వాలిటీ మట్టిని నింపాలని అధికారులు చెప్పారు. భూకంపాలను తట్టుకునేలా టెంపుల్ నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ ఫిల్ పైన16 అడుగుల ఎత్తులో ప్లింత్ను ఏర్పాటు చేస్తున్నారు.