కేసీఆర్ ఫోన్ చేయలేదు .. బీఆర్ఎస్లో చేరడం లేదు : బాబు మోహన్

 కేసీఆర్ ఫోన్ చేయలేదు ..  బీఆర్ఎస్లో చేరడం లేదు  :  బాబు మోహన్

బీఆర్ఎస్ పార్టీ చీఫ్,  మాజీ సీఎం కేసీఆర్ తనకు ఫోన్  చేశారంటూ  జరుగుతున్న ప్రచారాన్ని ప్రజాశాంతి పార్టీ నేత బాబు మోహన్ ఖండించారు.  తనకు కేసీఆర్ ఫోన్ చేయలేదన్నారు.  కేసీఆర్‌తో తాను మాట్లాడి సుమారు ఐదేళ్లు అయిందన్నారు.  ప్రజాశాంతి పార్టీ తరఫున తాను వరంగల్‌ ఎంపీగా పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

విశాఖలో ఓ కార్యక్రమానికి హాజరైన బాబు మోహన్‌ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేఏ పాల్ కూడా ఉన్నారు.   ఎన్నికల టైమ్ లో తాను పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు.  ఇటీవల బాబు మోహన్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు. 

మరోవైపు కడియం కావ్య  బీఆర్ఎస్ కు షాకిచ్చారు.  ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానని కేసీఆర్‌‌‌‌కు ఆమె లేఖ రాశారు. అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, వరంగల్‌‌లో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని స్పష్టం చేశారు.  కడియం కావ్య బీఆర్ఎస్‌‌‌‌లో యాక్టివ్  లీడరేమీ కాదు. కానీ, ఆమె తండ్రి, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావ్యకు టికెట్ ఇప్పించారు.