
ముషీరాబాద్, వెలుగు: స్కూళ్ల రీ ఓపెనింగ్ వేళ బాగ్ లింగంపల్లి లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ కు తాళం పడింది. అద్దె భవనంలో ఈ స్కూల్ నడుస్తుండగా ఏడాది నుంచి రెంట్ కట్టకపోవడంతో యజమాని సాహెల్ కొఠారి తాళం వేశారు. అద్దె ఇస్తేనే తాళం తీస్తానని మొండికేశారు. ఇందులో 370 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు.
తాళం వేయడంతో ప్రిన్సిపాల్, టీచింగ్ స్టాఫ్ గంటల పాటు బయట వేచి ఉండాల్సి వచ్చింది. అప్పటికే కొంతమంది విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి భవన యజమానితో మాట్లాడారు.
అయినా ఆయన వినకపోవడంతో తహసీల్దార్ కార్యదర్శి యాసిన్ భాషకు చెప్పారు. వారు ముందుగా ఐదు నెలల అద్దె బకాయి చెల్లిస్తామని చెప్పడంతో యజమాని తాళం తెరిచారు. అంతకుముందు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట యజమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.