దళిత మహిళకు అండగా ఉంటాం : బక్కి వెంకటయ్య

దళిత మహిళకు అండగా ఉంటాం : బక్కి వెంకటయ్య

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఇటీవల దళిత మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనలో బాధితురాలికి అండగా నిలుస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్ ​బక్కి వెంకటయ్య అన్నారు. ఘటనా పూర్వాపరాలు తెలుసుకునేందుకు శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆర్అండ్​బీ గెస్ట్​ హౌజ్​లో డీఎస్పీ ప్రకాశ్​తో సమావేశమై కేసు ఎంక్వైరీ గురించి మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్​ చేసినట్లు డీఎస్పీ చెప్పగా..మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్ట్​ చేయాలన్నారు. సఖి సెంటర్​లో ఉన్న బాధితురాలిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించి, బాధితురాలికి ఉపాధి కల్పించేలా కమిషన్​ చూస్తుందన్నారు. బాధిత మహిళకు దళిత సంఘాలు కూడా అండగా ఉంటాయన్నారు. కమిషన్​ మెంబర్ ​నేనావత్​ రాంబాబు నాయక్, జడ్పీ వైస్​ చైర్మన్​ ప్రేమ్​కుమార్, అంబేద్కర్​ సంఘం జిల్లా ప్రెసిడెంట్​ఆకుల బాబు, ఎమ్మార్పీఎస్​జిల్లా ప్రెసిడెంట్​ భూమయ్య, ప్రతినిధులు బాలరాజు, లక్ష్మి పాల్గొన్నారు.