బాల్కొండ, వెలుగు: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కొనసాగుతున్న ముప్కాల్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ తహసీల్దార్ ఆఫీస్ లో పని చేసే ఓ ఉద్యోగి బాల్కొండలోని ఓ ఇంటిలో పదేండ్లుగా అద్దెకు ఉంటున్నాడు. అయితే సదరు ఉద్యోగి రెంట్కు ఉన్న వ్యక్తి కొడుకు తన కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది.
శనివారం ఈ కేసు వ్యవహారంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతి మోసపోయాననే ఆవేదనతో స్టేషన్ బిల్డింగ్ పై నుంచి దూకింది. ఆమెకు గాయాలవగా, చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని ఎస్సై చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
