కృష్ణ పార్థివ దేహానికి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మాలయ స్టూడియోకు వెళ్లి కృష్ణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహేష్ బాబుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సాహసాలకు, ప్రయోగాలకు మారు పేరని చెప్పారు. టాలీవుడ్ కు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు.
మొదటి కౌబాయ్ సినిమా, మొదటి సినిమా స్కోప్ సినిమా, మొదటి 70 ఎం ఎం సినిమా, మొదటి డిటిఎస్ సౌండ్ సిస్టమ్ మూవీ.. ఇలా చాలా టెక్నికల్ అంశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారని కొనియాడారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణించారని.. పద్మాలయా స్టూడియోను స్థాపించారన్నారు. సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాల్లో నటించారని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కృష్ణ చెరగని స్థానం దక్కించుకున్నారని అన్నారు.