
రాయలసీమ బ్యాక్డ్రాప్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు బాలకృష్ణ. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాల తర్వాత రాయలసీమకు, బాలకృష్ణ సినిమాలకు మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ‘హిందూపూర్’కు ఎమ్మెల్యే కూడా కావడంతో తన సినిమాల బ్యాక్డ్రాప్ ఏదైనా కొన్ని సీన్స్ సీమలో తీసేందుకు బాలకృష్ణ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన తాజా చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాయలసీమలోనే జరుగుతోంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గత కొన్ని రోజులుగా కర్నూల్ జిల్లాలో యాగంటి, కొమ్మెచెరువు, పూడిచర్ల, ఓర్వకల్లుతో పాటు ఎయిర్పోర్ట్లోనూ షూటింగ్ జరుగుతోంది. తాజాగా షూటింగ్ను కర్నూలు సిటీకి షిప్ట్ చేశారు. సోమవారం నుంచి కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. అక్కడ కీలకమైన సీన్స్ తీస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. రేపటితో ఈ షెడ్యూల్ పూర్తవబోతున్నట్టు తెలుస్తోంది. ఇక షూటింగ్ అప్డేట్తో పాటు బాలకృష్ణ కొత్త లుక్ని కూడా రిలీజ్ చేశారు. రక్తం చిందిస్తోన్న పెద్ద కత్తి పట్టుకుని వైట్ అండ్ వైట్ కాస్టూమ్స్లో సీరియస్గా కనిపిస్తున్నాడు బాలయ్య. ఆయన కెరీర్లో ఇది నూట ఏడవ చిత్రం. ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.