కొచ్చి: టీమిండియా పేసర్ శ్రీశాంత్పై విధించిన ఏడేళ్ల స్పాట్ ఫిక్సింగ్ బ్యాన్ ఆదివారంతో ముగిసిపోయింది. దీంతో సోమవారం నుంచి అతను అన్ని అధికారిక టోర్నీలు ఆడేందుకు అర్హత సాధించాడు. అయితే కేరళ తరఫున డొమెస్టిక్ టోర్నీలు ఆడాలని శ్రీ భావిస్తున్నాడు. ‘ఇన్నాళ్లకు నాకు కావాల్సిన స్వాతంత్య్రం వచ్చింది. ఇన్ని రోజులు ఎంతో మానసిక వేదన అనుభవించా. ఇన్నాళ్లకు మళ్లీ ఆడే అవకాశం దొరికింది. కానీ కరోనా వల్ల దేశంలో ఎక్కడా క్రికెట్ ఆడే చాన్స్ లేదు. స్వయంగా నేనే ఓ టోర్నీ నిర్వహిద్దామనుకున్నా అది చాలా రిస్క్తో కూడుకున్నది. మే నెల నుంచి చాలా శ్రమిస్తున్నా. డొమెస్టిక్ యాక్టివిటీ ఆగిపోవడంతో రిటైర్మెంట్ చెబుదామని అనుకున్నా. కానీ క్రికెట్ కోసం ఇన్నాళ్లూ పడిన శ్రమ వృథా అవుతుందని ఆ ఆలోచన విరమించుకున్నా. మళ్లీ బరిలోకి దిగుతానని అమ్మకు మాటిచ్చా. దానిని నిలబెట్టుకుంటా. ఫిట్నెస్ ఫ్రూవ్ చేసుకుని కేరళకు ప్రాతినిధ్యం వహిస్తా. మరో ఆరేడు ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉంది’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. 37 ఏళ్ల శ్రీశాంత్ ఇండియా తరఫున టెస్ట్ల్లో 87 వికెట్లు సాధించాడు.