అసైన్డ్ భూముల్లో రియల్ దందా ఆపండి..  కేసీఆర్కు బండి సంజయ్ లేఖ

అసైన్డ్ భూముల్లో రియల్ దందా ఆపండి..  కేసీఆర్కు  బండి సంజయ్ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు. దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపాలని లేఖలో పేర్కొన్నారు. దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములను లాక్కుంటూ రియల్‌ వ్యాపారం చేయడం దుర్మార్గం అన్నారు. అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమే అని లేఖలో చెప్పుకొచ్చారు. దళితులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి దళితులు మోసం చేశారని ఆరోపించిన బండి సంజయ్.. పోడు భూములకు పట్టాలిస్తాం అంటూ హామీలివ్వడవ్వమే తప్ప అమలు చేయడంలేదన్నారు.

గిరిజనుల బతుకులను ఆగం చేస్తున్నరు

బీఆర్ఎస్ నేతల  రియల్ ఎస్టేట్ దందాకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష అని లేఖలో ప్రశ్నించారు బండి సంజయ్.  బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ కరువైందన్నారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలన్నారు. అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందాకు తెరదించకుంటే బిజెపి తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.