పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. గత నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.దీంతో చర్లపల్లి జైలు నుంచి అధికారులు భగీరథ్ ను విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే.?
హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో బండి భగీరథ్పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బండి భగీరథ్, 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి.. 17 ఏళ్ల తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, అత్యాచారం చేశాడనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
మే 16న అరెస్ట్
ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన పేట్ బషీరాబాద్ పోలీసులు.. మే 16వ తేదీ రాత్రి బండి భగీరథ్ను అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ జిల్లా జడ్జి నివాసంలో హాజరుపరచగా.. న్యాయమూర్తి భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.నెల రోజులుగా జైలులోనే ఉన్న భగీరథ్కు, తాజాగా కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
