అఖండ భారత్ నిర్మాణమే బీజేపీ లక్ష్యం : బండి సంజయ్

అఖండ భారత్ నిర్మాణమే బీజేపీ లక్ష్యం : బండి సంజయ్

కరీంనగర్: ఆర్టికల్ -370 రద్దు చేసినప్పుడు … ఎంపీగా తాను గెలిచినదానికంటే ఎక్కువ సంతోషపడ్డానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పారు.  ఆర్టికల్ 370 రద్దు చేసే ప్రక్రియలో ఓటేసే అవకాశం రావడాన్ని గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ దేశాన్ని ఇన్నేళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టికల్ పై నోరు మెదపలేదనీ… కేవలం 3 కుటుంబాల కోసమే 370 ఆర్టికల్ ను ఇంతకాలం కొనసాగించారని అన్నారు. కేవలం మోడీ, అమిత్ షా మాత్రం దేశంకోసం ఆలోచించి ఇంతటి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు బండి సంజయ్. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండాలన్న దేశ ప్రజల కల నెరవేరిందన్నారు. అఖండ భారత్ నిర్మాణమే బీజేపీ లక్ష్యమని చెప్పారు కరీంనగర్ ఎంపీ సంజయ్.

“జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణం చట్టం, ఆర్టికల్ 370 రద్దు- వర్థమాన పరిస్థితులు” అంశంపై పద్మనాయక కల్యాణ మండపంలో బీజేపీ అధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, ఇతర నాయకులు, మేధావులు, బీజేపీ వర్కర్లు పాల్గొన్నారు.