- సెల్ఫ్ ఎన్యుమరేషన్ను పూర్తి చేసిన బండి సంజయ్
న్యూఢిల్లీ, వెలుగు: డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించడం ‘వికసిత భారత్’ లక్ష్య సాధనకు ఎంతో దోహదపడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జనగణన పోర్టల్లో వివరాలు నమోదు చేయడం సంతోషకరమని తెలిపారు. ఇది దేశాభివృద్ధిని వేగవంతం చేస్తుందని చెప్పారు.
బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో బండి సంజయ్ను జాతీయ రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణాంకాల కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్, జాయింట్ డైరెక్టర్ దీరజ్ జైన్తొ పాటు పలువురు ఉన్నతాధికారులు కలిశారు. తొలిదశలో లోకేషన్ డిటైల్స్, ఒక కుటుంబం ఉండే ఇల్లు, ఆఫీస్, సౌకర్యాల వివరాలను సేకరిస్తున్నట్లు మంత్రికి తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండే స్వీయ ఎన్యుమరేషన్ ను నమోదు చేసుకునేందుకు వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ డిజిటల్ విధానంలో స్వయంగా తన ఇల్లు, ఇంట్లోని సౌకర్యాల వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పౌరులకు స్వీయ-ఎన్యూమరేషన్ అవకాశాన్ని కల్పించడం ద్వారా జనగణన దిగ్విజయవంతం అవుతుందని అన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు స్వీయ-ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను సమర్పించేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు.
