కేంద్రాన్ని బదనాం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తుండు

కేంద్రాన్ని బదనాం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తుండు

సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంవో కుట్రేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ సీతారాంపూర్ లో బీజేపీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇంచార్జ్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే అయినా కేంద్రంపై బురద చల్లడం సిగ్గచేటన్నారు. ఆర్మీ అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని.. అగ్నిపథ్ గొప్ప స్కీం అని చెప్పారు. ఈ పథకంపై ఏమైనా అనుమానాలు, అపోహాలుంటే నివృత్తి చేసుకోవాలే తప్ప విధ్వంసాలకు పాల్పడవద్దన్నారు.

టీఆర్ఎస్ లో  సీఎం సీటు కోసం గొడవలు మొదలయ్యాయని..త్వరలోనే ఆ పార్టీ చీలిపోవడం ఖాయమని బండి సంజయ్ అన్నారు. వచ్చే నెల 3న హైదరాబాద్ లో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుతామన్నారు. రాష్ట్రంలో మరే పార్టీ చేయలేనంతగా జనసమీకరణ చేసి చరిత్ర  సృష్టిద్దామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్లను పదేపదే అరెస్ట్ చేస్తారు కానీ..కాంగ్రెస్ ను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తారని విమర్శించారు. బీజేపీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి..బీజేపీని డ్యామేజ్ చేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే టీఆర్ఎస్ గ్రాఫ్ 30 శాతానికి పడిపోయిందని..దీనికితోడు ట్రిపుల్ ఐటీ, గౌరవెల్లి నిర్వాసితులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల విషయంలో చర్చ జరగకుండా ప్రజలను దారి మళ్లించేందుకు అగ్నిపథ్ పేరుతో విధ్వంసానికి కేసీఆర్ నీచమైన కుట్ర చేస్తుండని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిన్న మీటింగులు పెట్టినా, ధర్నాలు చేసినా ఇంటలిజెన్సుకు తెలుస్తుంది కానీ వందల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టిస్తే ఆ సమాచారం ఎందుకు తెలియలేదని ప్రశ్నించారు. విధ్వంసం చేసినోళ్లు పారిపోయేలా చేసిన పోలీసులు.. అమాయకులైన ఆర్మీ అభ్యర్థులను మాత్రం సాయంత్రం పొద్దుపోయే వరకు అక్కడే ఉంచారన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లలో కూడా కేసీఆర్ లాంటోళ్లే దాడులు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.