గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్యాంక్ బండ్ కు చేరుకున్నారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్ మార్గంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఏర్పాట్ల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరును బండి సంజయ్ తప్పుపట్టారు. బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని అన్నారు. అసెంబ్లీ నిర్వహించాలంటే.. కేసీఆర్ భయపడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇక బీజేపీ పార్లమెంట్ స్థాయి కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా ఇంఛార్జ్ లతో ఇవాళ బండి సంజయ్ భేటీ అయ్యారు.

స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడమేంటి..?

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరికాదని బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరుపై శాసనసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై బీజేపీ సభ్యులు నిలదీస్తారనే భయం కేసీఆర్ కు పట్టుకుందని, అందుకే సభను రెండ్రోజులపాటే నిర్వహించి తూతూ మంత్రంగా ముగించాలని చూస్తున్నారని సంజయ్ ఫైర్ అయ్యారు.