బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం : బండి సంజయ్

బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం : బండి సంజయ్

హైదరాబాద్​ పాతబస్తీలో సభ పెడితే తన భార్య తల నరికేస్తామని, తమ పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. అయినా వెనుకంజ వేయకుండా పాతబస్తీలో సభ పెట్టిన చరిత్ర తమదే అన్నారు. పార్టీకి దూరమైనా ధర్మం కోసం పోరాడిన వీరుడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అని చెప్పారు.

ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా హిందూ ధర్మం కోసం పోరాడే కార్యకర్తలు బీజేపీ పార్టీకే సొంతమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర తనది అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల అంతర్గత సమావేశంలో బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. 

కరీంనగర్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే మేయర్ పదవి ఎంఐఎంకు ఇచ్చేలా చీకటి ఒప్పందం జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎంకు 30 స్థానాలు కేటాయించి.. గెలిపించే బాధ్యత బీఆర్ఎస్ కు అప్పగించారని చెప్పారు.

ఓడిపోతామనే భయంతోనే దారుస్సలాం పోయి ఒవైసీకి బీఆర్ఎస్ నేతలు సలాం చేశారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో బీజేపీ నాయకులను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు వెదజల్లుతున్నారని చెప్పారు. దయచేసి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని, బీఆర్ఎస్ ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే కంకణం కట్టుకున్నారని తెలిపారు.