సీఎం కేసీఆర్ భాషను సెన్సార్ చేయాలి

సీఎం కేసీఆర్ భాషను సెన్సార్ చేయాలి

రాష్ట్ర ముఖ్యమంత్రికి పిచ్చి ముదిరి, హద్దు మీరి, దిగజారి మాట్లాడాతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ భాషను సెన్సార్ చేయాలని.. టీవీలలో ఆయన లైవ్ కూడా బంద్ చేయాలని ఆయన అన్నారు. కేసీఆర్ మాట్లాడేటప్పుడు  బీప్ సౌండ్ వేసి బూతులు కట్ చేయాలని.. లేదంటే చానళ్లపై కేసులు పెడతారని సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ సోమవారం ఓ ప్రెస్ మీట్ లో కిషన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

‘కిషన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో హుందాగా, మంచి భాషను ఉపయోగిస్తూ మాట్లాడారు. కేంద్ర మంత్రిని పట్టుకుని, ఏదిపడితే అది మాట్లాడితే సహించేది లేదు. కేసీఆర్ నీ మాటలు, తిట్లను నీ పక్కనున్న వాళ్లే అసహ్యించుకుంటున్నారు. నీ నోటిని ఫినాయిల్ తో కడిగినా, ఇనుప బ్రష్ తో రుద్దినా ఉపయోగం లేదు. వడ్లు కొంటాం అని మేం చెబుతున్నాం. కొనేది లేదని నువ్వు చెబుతున్నావ్. కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తామని అంటున్నది నువ్వు. అయినా అన్నీ కేంద్రం కొన్నాక.. నువ్వు ఉన్నది ఎందుకు? మొన్నటి వరకు మొత్తం నువ్వే కొంటా అన్నావు. యాసంగి పంట కూడా కొనాల్సిందే. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణలో మాత్రమే ఎందుకొస్తుంది? వరి దిగుబడిలో తెలంగాణ 7వ స్థానంలో, సేకరణలో మొదటి స్థానంలో ఉంది. మెడ మీద కత్తి పెడితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కి కూడా తెలంగాణ రాసి ఇస్తావా? మెడ మీద కత్తి పెట్టినందుకే కృష్ణా వాటాకు ఒప్పుకున్నవా? మెడ మీద కట్టి పెడితే ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదు. మరి నేను మెడ మీద కత్తి పెడతా, ఫామ్ హౌస్ రాసిస్తావా? ఫిజికల్ వెరిఫికేషన్ రిపోర్టులో ఒక్క వరంగల్ జిల్లాలోనే చాలా తేడా ఉన్నట్టు తేలింది. సాగు విస్తీర్ణం, దిగుబడి గణాంకల్లో తేడా ఉంది. పాత బియ్యం రీసైక్లింగ్ జరుగుతుంది. ఈసారి కొత్తగా కేంద్రం యాసిడ్ టెస్ట్ చేస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ బండారం, మిల్లర్ల బండారం బయటపడుతుంది. అందుకే మిల్లర్ల కోసం టీఆర్ఎస్ గొడవ చేస్తోంది. బాయిల్డ్ రైస్ సమస్య అధిగమించడానికి 5 రకాల విత్తనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని రైతులకు ఇవ్వొచ్చు. ఆ బియ్యం కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది. కానీ కేసీఆర్ రైతులకు ఆ విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద కేసీఆర్ కి ప్రేమ కలుగుతోంది. బహుశా ఆ దేశాలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడేమో? అక్కడ జరిగే ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు నిధులిస్తున్నారా? నిఘా సంస్థలు దృష్టి పెట్టాలి. రైతులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు. నీ కంటే పెద్ద హంతకుడు ఎవరున్నారు?’ అని  బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.