- వాళ్లే బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్లు: బండి సంజయ్
హైదారాబాద్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించినా అక్కడి ప్రజలు మాత్రం ధర్మం వైపే నిలిచారని, తమదే గెలుపని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. డబ్బుల ద్వారా హుజూరాబాద్లో గెలవాలని చూసిన సీఎం కేసీఆర్కు రైతులు షాక్ ఇవ్వబోతున్నారని అన్నారు. అక్కడి రైతులే బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలిపారని కొనియాడారు. శనివారం పోలింగ్ ముగిసిన అనంతరం సంజయ్ హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మగౌరవ పోరాటంలో తమ అభ్యర్థి ఈటల రాజేందర్ వైపు నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ద్వారా టీఆర్ఎస్ ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా తమ కార్యకర్తలు ఎక్కడ కూడా అదరక, బెదరక ఈటల గెలుపు కోసం నిరంతరం శ్రమించారని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో బీజేపీ క్యాడర్ మరింత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సంజయ్ పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ డబ్బులు పంచినా పోలీసులు అడ్డుకోలేదు: ప్రేమేందర్ రెడ్డి
పోలింగ్ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా, విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేసినా, ధర్నా చేసినా టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోలేదని మండిపడ్డారు. పోలింగ్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఆయన దుయ్యబట్టారు.