ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగినట్లు కేసీఆర్ ఒప్పుకుంటున్నారా : బండి సంజయ్

ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగినట్లు కేసీఆర్ ఒప్పుకుంటున్నారా : బండి సంజయ్
  • కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
  • ‘ఓఆర్‌ఆర్‌’ టోల్ టెండర్‌ అవకతవకలపై విచారణ చేపట్టాలె

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలు జరిగాయంటూ లేఖ రాశారు. ‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదని కేసీఆర్ ను నిలదీశారు. ‘‘ మీ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి..?’’ అని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. 

‘‘టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా రాష్ర్ట ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి..? ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి. మీకు ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణమే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.