
హైదరాబాద్: కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారు సెల్ఫ్ లాక్డౌన్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేశ్కు కరోనా సోకిందనే వార్త టీ–టౌన్లో సంచలనంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కరోనా పాజిటివ్గా తేలిన తొలి వ్యక్తి బండ్ల గణేశ్ కావడం గమనార్హం. తనకు వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనిపించడంతో గణేశ్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైరస్ పాజటివ్గా తేలింది. గణేశ్ ఫ్యామిలీ మెంబర్స్కు కరోనా పరీక్షలు చేశారు. వాటి రిజల్ట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన కుటుంబీకులను క్వారంటైన్లో ఉంచారు. పౌల్ట్రీ బిజినెస్ చూసుకోవడంలో భాగంగా బండ్ల గణేశ్ రెగ్యులర్గా షాద్నగర్ వెళ్తుంటారు. బహుశా ఆ ఫామ్లోనే ఆయనకు కరోనా సోకి ఉండొచ్చని సన్నిహితులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై గణేశ్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం పలు తెలుగు మూవీ ప్రాజెక్టులకు సైన్ చేయాల్సిన బండ్ల గణేశ్.. వాటి స్క్రిప్టులను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం.