ఫాంహౌస్ ఇష్యూ.. రామచంద్రభారతిపై మరో కేసు

ఫాంహౌస్ ఇష్యూ.. రామచంద్రభారతిపై మరో కేసు

హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదు అయింది. ఈయన వద్ద నకిలీ ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నాయంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి మూడు చొప్పున ఫేక్ ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను  తయారు చేయించుకొని పెట్టుకున్నాడని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. రెండ్రోజుల క్రితమే పోలీసులు రామచంద్రభారతిపై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ.. ఆ వివరాలను వెంటనే వెల్లడించలేదు. 

రామచంద్ర భారతి పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

మొయినాబాద్​ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితుడు రామచంద్ర భారతి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవంబరు 7న ఈ పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం .. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను యుద్ధ క్షేత్రాలుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించింది.  ఏపీ, తెలంగాణ నుంచి వచ్చే కేసులు ఈ కోవకు చెందినవిగా ఉంటున్నాయని పేర్కొంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్  అడ్వకేట్  సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ... నిందితుల బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్నదన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన పిటిషనర్ రామచంద్ర భారతి తరఫు సీనియర్ అడ్వకేట్​ విశ్వనాథన్..  పార్టీ వేసిన పిటిషన్ కు, తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. పార్టీల ఆందోళనలను తాము కంట్రోల్ చేయలేమని నివేదించారు. నిందితుడి హక్కుల కోసమే హైకోర్టులో వాదనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న బెంచ్​.. ‘‘కొన్ని సందర్భాల్లో ఏపీ, తెలంగాణ నుంచి వస్తున్న కేసుల్లో రాజకీయ వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. కోర్టులను రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధ క్షేత్రాలుగా మార్చుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.