హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతిపై మరో కేసు నమోదు అయింది. ఈయన వద్ద నకిలీ ఆధార్కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి మూడు చొప్పున ఫేక్ ఆధార్ కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లను తయారు చేయించుకొని పెట్టుకున్నాడని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. రెండ్రోజుల క్రితమే పోలీసులు రామచంద్రభారతిపై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ.. ఆ వివరాలను వెంటనే వెల్లడించలేదు.
రామచంద్ర భారతి పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితుడు రామచంద్ర భారతి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవంబరు 7న ఈ పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం .. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను యుద్ధ క్షేత్రాలుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణ నుంచి వచ్చే కేసులు ఈ కోవకు చెందినవిగా ఉంటున్నాయని పేర్కొంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ... నిందితుల బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్నదన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన పిటిషనర్ రామచంద్ర భారతి తరఫు సీనియర్ అడ్వకేట్ విశ్వనాథన్.. పార్టీ వేసిన పిటిషన్ కు, తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. పార్టీల ఆందోళనలను తాము కంట్రోల్ చేయలేమని నివేదించారు. నిందితుడి హక్కుల కోసమే హైకోర్టులో వాదనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న బెంచ్.. ‘‘కొన్ని సందర్భాల్లో ఏపీ, తెలంగాణ నుంచి వస్తున్న కేసుల్లో రాజకీయ వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. కోర్టులను రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధ క్షేత్రాలుగా మార్చుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.